AP TS Weather: ద్రోణి ప్రభావంతో వర్షాలు .. ఈ ప్రాంతాలకు పిడుగు హెచ్చరికలు
Weather Updates of AP and Telangana: ఏపీతో పాటు తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Weather Updates of Telugu States: తెలుగు రాష్ట్రాల్లో రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుండగా... సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షాలు పడుతున్నాయి. పలుచోట్ల మధ్యాహ్నం వేళలో కూడా వానలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఏపీకి మరోసారి వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. ద్రోణి ప్రభావంతో ఇవాళ అనకాపల్లి, అల్లూరి,కాకినాడ,ఉభయగోదావరి, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని... ప్రజలు,రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున్న చెట్ల కింద ఉండరాదని స్పష్టం చేసింది.
ట్రెండింగ్ వార్తలు
రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తాతో పాటూ యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, మన్యం గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట, అల్లూరి, అనంతగిరి, అరకులోయ, జీకే వీధి, కొయ్యూరు మండల్లాలో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు చెట్ల క్రింద ఉండరాదని పేర్కొంది.
ఇక తెలంగాణలో కూడా రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు రెండు రోజుల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు సాగడానికి అనుకూలంగా ఉన్నట్లుపేర్కొంది. విదర్భ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి కొన్నసాగుతుందని… ఈ ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లు వివరించింది.
ఇవాళ తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి,మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాజ్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడకక్కడ మెరపులు, ఉరుములతో వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.