Vontimitta Kalyanam : "పురాణాల ప్రకారం త్రేతాయుగంలో శ్రీ రామచంద్రుడు దండకారణ్యంలో సీతా లక్ష్మణ సమేతుడై సంచరించారు. సీతాదేవి దప్పిక తీర్చడానికి భూమిలోకి బాణం వేయగా నీటి బుగ్గ పడింది. అదే ఒంటిమిట్టలోని రామతీర్థమైంది. సీత అన్వేషణ కోసం రావణ సంహారం కోసం శ్రీరామచంద్రునికి సహకరించిన హనుమంతుని పరివారంతో పాటు జాంబవంతుడు కూడా ఉన్నారు.
ఆ జాంబవంతుడు సేవించిన సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట ఆలయంలో కొలువై ఉన్నారు. ఒకే రాతిపై శ్రీ సీత రామ లక్ష్మణ దేవత మూర్తులు ఉండడంవల్ల ఒంటిమిట్టను ఏకశిలా నగరం అని కూడా అంటారు. ఈ దేవాలయ నిర్మాణం 14వ శతాబ్దంలో ప్రారంభమై 17వ శతాబ్దానికి పూర్తయినట్లు ఆలయంలో ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. 1356లో బుక్కరాయలు, ఆ తర్వాత కాలంలో విజయనగరాజులు, మట్లి రాజులు క్రమంగా గుడి అంతరాలయం, రంగ మండపం, మహా ప్రాంగణం, గోపురాలు నిర్మించారు" అని టీటీడీ తెలిపింది.
ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని సీఎం చంద్రబాబు ఆదేశాలతో 2015, సెప్టెంబరు 9న టీటీడీ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి పురాతన చారిత్రక ప్రాశస్త్యం గల రామాలయాన్ని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకుని ఆలయం లోపల, బయట టీటీడీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి ఏడాది సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వంగా సుందరంగా కల్యాణ వేదిక, కల్యాణాన్ని వీక్షించే భక్తుల సౌకర్యార్థం షెడ్లు, మరుగుదొడ్లు, యాత్రీకుల వసతి సముదాయాలు నిర్మించారు.
అదేవిధంగా ఆలయ లోపల పోటు, యాగశాల, పరిసరాల మరమ్మత్తులు, నూతన పుష్కరిణి, వాహన మండపం నిర్మాణం, మాడ వీధులలో సీసీ రోడ్లు, డ్రైనేజి తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయానికి వచ్చే భక్తులకు మరింత అహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు పరిసరాలలో పచ్చదనం పెంపొందించారు.
ఏప్రిల్ 11న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పున్నమి వెలుగులో అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. కల్యాణానికి విచ్చేసే లక్షలాధి మంది భక్తులకు అవసరమైన తాగునీరు, అన్నప్రసాదాలు, భద్రత, రవాణా, వైద్యం, పారిశుద్ధ్యం, పార్కింగ్ తదితర అంశాలపై టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఏర్పాట్లు చేస్తోంది.
సంబంధిత కథనం