Vizianagaram Knife Attack : ఏపీలో మరో యువతిపై దాడి జరిగింది. ఇటీవల విశాఖలో ఓ ప్రేమోన్మాది యువతి, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తల్లి మృతి చెందింది. శనివారం విజయనగరం జిల్లా గరివిడి మండలంలో మరో ఘటన చోటుచేసుకుంది. గరివిడి మండలం శివరాంలో అఖిల(18) అనే యువతిపై ఆదినారాయణ(21) అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.
యువతిపై కత్తితో దాడికి పాల్పడిన నిందితుడు ఆదినారాయణను అరెస్టు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. దాడి జరిగిన 24 గంటల్లోగా నిందితుడిని అరెస్టు చేశామన్నారు. శనివారం అఖిలపై ఆదినారాయణ కత్తితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు వివరాలను తాజాగా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాకు వెల్లడించారు. నిందితుడు దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
అఖిల తన ఇంటిలో ఉండగా...నిందితుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. దాడికి పాల్పడిన నిందితుడు యువతి సోదరుడికి స్నేహితుడని ఎస్పీ తెలిపారు. గతంలో యువతి కుటుంబ సభ్యులతోనూ ఆదినారాయణ సన్నిహితంగా ఉండేవాడని చెప్పారు. స్నేహితుడి సోదరైన అఖిలకు ఆదినారాయణ అసభ్య సందేశాలు పంపేవాడు. ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయాన్ని యువతి కుటుంబ సభ్యులతో చెప్పడంతో అతడిని హెచ్చరించారు. దీంతో కక్ష పెంచుకున్న ఆదినారాయణ అఖిలపై కత్తితో దాడి చేశాడని ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు.
విజయనగరం జిల్లా గరివిడి మండలంలో శివరాం గ్రామానికి చెందిన అఖిల అనే 18 ఏళ్ల యువతి మీద జరిగిన దాడిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, టీడీపీ నేత కిమిడి నాగార్జునతో కలిసి మెడికోవర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి సంఘటన ప్రశాంతంగా ఉన్నటువంటి విజయనగరం జిల్లా పరిధిలో జరగటం చాలా దురదృష్టకరం అన్నారు.
యువత వ్యసనాలకి బానిసై ఇలాంటి దాడులకు దిగి తల్లిదండ్రులకి గర్భశోకాన్ని కలిగిస్తున్నారన్నారు. యువత వాళ్ల తల్లితండ్రులు ఆశయాలు వైపు దృష్టి మరల్చాలని కోరకారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ పురావృతం కాకుండా చూడాలన్నారు. ఈ సంఘటనకి కారణమైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. బాధితురాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
సంబంధిత కథనం