విజయనగరంలో విషాదం, కారులో చిక్కుకొని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి-vizianagaram car tragedy suffocation kills four young children ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  విజయనగరంలో విషాదం, కారులో చిక్కుకొని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

విజయనగరంలో విషాదం, కారులో చిక్కుకొని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

విజయనగరంలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు చిన్నారులు కారులో చిక్కుకొని ఊపిరి ఆడక మృతి చెందారు. చిన్నారులు ఆడుకునేందుకు కారు లోపలికి వెళ్లగా... లాక్ అయి అందులో చిక్కుకుపోయారు. ఎవరూ గమనించకపోవడంతో ఊపిరి ఆడక ప్రాణాలు కోల్పోయారు.

విజయనగరంలో విషాదం, కారులో చిక్కుకొని ఊపిరాడక నలుగురు చిన్నారులు మృతి

విజయనగరంలో విషాద ఘటన జరిగింది. పట్టణంలోని కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. కారులో చిక్కుకుని ఊపిరి ఆడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు చిన్నారులు ఇవాళ ఉదయం ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు.

కారులో చిక్కుకొని

పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. అయినా వారి ఆచూకీ లభించలేదు. స్థానికంగా ఉన్న మహిళా మండలి ఆఫీసు వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు పిల్లల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. ఆడుకునేందుకు కారులోపలికి వెళ్లగా...లాక్ పడి ఊపిరి ఆకడ చిన్నారులు మృతి చెందారని తెలుస్తోంది.

అక్కా చెల్లెళ్లు మృతి

మృతులు చారుమతి, ఉదయ్, చరిష్మా, మనస్విగా పోలీసులు గుర్తించారు. చిన్నారుల్లో చారుమతి, చరిష్మా ఇద్దరు అక్కాచెల్లెళ్లు అని స్థానికులు చెబుతున్నారు. ఒకేసారి నలుగురు పిల్లలు మృతిచెందడంతో ద్వారపూడిలో విషాదం అలుముకుంది. విగతజీవులైన చిన్నారులను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలు పగిలేలా రోదించారు.

చిత్తూరు జిల్లాలో

చిత్తూరు జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది. దేవరాజపురంలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గౌతమి, షాలిని, అశ్విన్ మృతి చెందారు.

ఏలూరు జిల్లాలోని జల్లేరు జలాశయం చూసేందుకు వెళ్లి షేక్ సిద్దిఖ్ , అబ్దుల్ నీటి మునిగి చనిపోయారు.

బావిలోకి దూసుకెళ్లి కారు, ముగ్గురు మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు బావిలోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. పీలేరు మండలం బాలమువారిపల్లి పంచాయతీ పరిధిలోని కురవపల్లి వద్ద ఆదివారం వేకువజామున కారు బావిలోకి దూసుకెళ్లింది. .

కర్ణాటకలోని కోలార్ కు చెందిన శివన్న, లోకేశ్, గంగరాజులు ఏపీకి వ్యక్తిగత పనుల మీద వచ్చారు. పని పూర్తి చేసుకుని తిరిగి స్వస్థలానికి వెళ్తూ...కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివన్న, లోకేశ్, గంగరాజు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బావి నుంచి కారు, మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం