Vizag Steel Plant : పండ‌గ పూట ప‌స్తులే.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఐదు నెల‌లుగా అంద‌ని జీతాలు-vizag steel plant employees have not received their salaries for five months ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizag Steel Plant : పండ‌గ పూట ప‌స్తులే.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఐదు నెల‌లుగా అంద‌ని జీతాలు

Vizag Steel Plant : పండ‌గ పూట ప‌స్తులే.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులకు ఐదు నెల‌లుగా అంద‌ని జీతాలు

HT Telugu Desk HT Telugu
Jan 15, 2025 08:58 AM IST

Vizag Steel Plant : ప్ర‌తిష్ఠాత్మ‌క వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు.. పండ‌గ పూట కూడా ప‌స్తులే ఉంటున్నారు. ఐదు నెల‌లుగా స్టీల్‌ప్లాంట్ ఉద్యోగుల‌కు జీతాలు ఇవ్వటం లేదు. దీంతో ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. జీతాలు లేక‌పోతే పండ‌గ ఎలా చేసుకోవాలంటూ.. కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు.

వైజాగ్ స్టీల్‌ప్లాంట్
వైజాగ్ స్టీల్‌ప్లాంట్

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో 9,460 మంది శాశ్వ‌త అధికారులు, ఉద్యోగులు, 12 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల‌ు ఉన్నారు. వీరికి గ‌త కొన్ని నెల‌లుగా జీతాలు ఇవ్వటం లేదు. సెప్టెంబ‌ర్‌లో 50 శాతం, అక్టోబ‌ర్ 25 శాతం, న‌వంబ‌ర్‌లో 25 శాతం, డిసెంబ‌ర్‌లో 35 శాతం మాత్ర‌మే ఇచ్చారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు నాలుగైదు నెల‌ల నుంచి పూర్తిస్థాయి జీతాలు ఇవ్వటం లేదు. హెఆర్ఏ, ఎల్‌టీసీ, ఎల్ఎల్‌టీసీ, ద‌స‌రా, దీపావ‌ళి బోన‌స్‌ను పూర్తిగా ఆపేశారు. వేత‌న స‌వ‌ర‌ణ జ‌ర‌గ‌లేదు.

సాగనంపేందుకు కుట్రలు..

కార్మికులను సాగ‌నంపేందుకు యాజ‌మాన్యం కుట్ర‌కు తెర‌తీసింది. కార్మికుల‌ను సాగ‌నంపేందుకు సిద్ధ‌మైంది. వీఆర్ఎస్ ప‌థ‌కం అమ‌లుకు ఆర్ఐఎన్ఎల్ నోటిఫికేష‌న్ ఇచ్చింది. ఆ నోటిఫికేష‌న్‌లో 45 ఏళ్ల వ‌య‌సు, 15 ఏళ్ల స‌ర్వీస్ పూర్తి అయిన వారు వీఆర్ఎస్ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని స్పష్టం చేసింది. త‌ద్వారా 2025 మార్చిలోపు వెయ్యి మందిని బ‌య‌ట‌కు పంపేందుకు యాజ‌మాన్యం సిద్ధమైంది. గ‌త ఐదేళ్ల నుంచి ప్ర‌తి ఏడాది 1000 నుంచి 1,100 మంది ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు. వారిస్థానంలో నియామ‌కాలు జ‌ర‌గ‌టం లేదని సీఐటీయూ నేత కేఎం శ్రీ‌నివాస్ వివరించారు. జీతాల కోత విధింపు, ఉద్యోగులకు జీతాల కోత వంటి చర్యలతో కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

బ‌ల‌వంత‌గా వీఆర్ఎస్‌..

మ‌రోవైపు బ‌ల‌వంత‌గా వీఆర్ఎస్‌కు పంపిస్తున్నారు. ఇప్ప‌టికి ఐదు నెల‌లుగా జీతాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో ఉద్యోగులు ఆందోళ‌న బాట ప‌ట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాల‌ని విశాఖ ఉక్కు కార్మికులు అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. జీతాలు లేక‌పోతే పండ‌గ ఎలా చేసుకోవాలంటూ కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ దౌర్భాగ్య ప‌రిస్థితికి కేంద్రంలోని ఎన్‌డీఏ, రాష్ట్రంలోని కూట‌మి ప్రభుత్వాలే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తున్నారు.

ప్రైవేటీకరణకు చర్యలు..

కేంద్ర ప్ర‌భుత్వం విశాఖ‌ప‌ట్నం స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగ‌మ్ లిమిటెడ్‌-ఆర్ఐఎన్ఎల్‌)ను ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్ప‌టికే కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోదం తెల‌ప‌డంతో చ‌ర్య‌ల‌కు పూనుకుంటుంది. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌లోని ఒక్కో భాగాన్ని ప్రైవేటీక‌ర‌ణ చేసేందుకు సిద్ధ‌ప‌డింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని వంద శాతం పెట్టుబడుల ఉప‌సంహ‌ర‌ణ‌కు సంబంధించి ప్రక‌ట‌న వెలువ‌డిన త‌రువాత ఒక్కొక్క చ‌ర్య‌లు చేప‌ట్టింది.

కార్మికుల పోరాటంతో..

ఇప్ప‌టికే దాదాపు 2,000 మంది ఉద్యోగుల‌ను ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని నాగర్‌న‌ర్ స్టీల్‌ప్లాంట్‌కు పంప‌డానికి సిద్ధ‌ప‌డింది. అలాగే 4,200 మంది స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ వ‌ర్క‌ర్స్‌ను తొలగించేందుకు వారికి ఎంట్రీ, ఎగ్జిట్ పాస్‌ల‌ను ఇవ్వ‌కుండా కుట్ర‌లు చేసింది. కార్మికులు పోరాటంతో యాజ‌మాన్యం వెన‌క్కి త‌గ్గింది. అలాగే బ్లాస్ ఫర్నేస్‌ను నిలిపివేసింది. ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను నిలిపివేసింది. మ‌ళ్లీ కార్మికుల ఆందోళ‌న‌తో వెన‌క్కి త‌గ్గింది. ఇలాంటి కుట్ర‌ల‌తో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఉత్ప‌త్తిపై ప్ర‌భావం చూపే విధంగా యాజ‌మాన్యం, కేంద్ర ప్ర‌భుత్వం చర్య‌ల‌కు పూనుకున్నాయి.

ఫైర్ స్టేషన్ బాధ్యతలు..

తాజాగా స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఒక యూనిట్‌ను ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధం అయ్యింది. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఫైర్ స్టేష‌న్ న‌డిపే బాధ్య‌త‌ను ప్రైవేట్ సంస్థ‌ల‌కు అప్ప‌గించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందుకు సంబందించి వైజాగ్ స్టీల్ యాజ‌మాన్యం ఎక్స్‌ప్రెష‌న్ ఆఫ్ ఇంట్ర‌స్ట్ (ఈవోఐ)కు ద‌ర‌ఖాస్తులు ఆహ్వానించింది. స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఆర్ఎంహెచ్‌పీ, సింట‌ర్ ప్లాంట్‌, కోక్ ఓవెన్స్‌, స్టీల్‌మెల్ట్ షాప్‌, బ్లాస్ట్‌ఫ‌ర్నేస్, రోలింగ్ మిల్స్‌, ఎయిర్ సెప‌రేష‌న్ ప్లాంట్‌, సీఆర్ఎంపీ, థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్‌, ఎల్‌పీజీ స్టోరేజ్ ట్యాంక్‌లు, వాట‌ర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌, గ్యాస్ హోల్డ‌ర్లు, ఎన‌ర్జీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌, స్టీల్‌ప్లాంట్‌లోని ఎల‌క్ట్రిక‌ల్ డిస్ట్రిబ్యూష‌న్ నెట్‌వ‌ర్క్ త‌దిత‌ర కీల‌క‌మైన విభాగాల్లో ఫైర్ స్టేష‌న్ సేవ‌లు అందిస్తుంది.

ఇప్పుడు హామీలు.. ఇప్పుడు మౌనం..

వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీక‌ర‌ణ కానివ్వ‌బోమ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారంలో వాగ్ధానం చేశారు. కానీ ఇప్పుడు ఒక్కొక్క‌టి ప్రైవేట్ ప‌రం అవుతుంటే క‌నీసం స్పందించ‌డం లేదు. మ‌రోవైపు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు. కానీ ఆయ‌న కూడా మౌనం దాల్చ‌డంపై స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. స్థానిక ఎంపీ భ‌ర‌త్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌పై స్పందించ‌డం లేదు. అలాగే ప్ర‌తిప‌క్షంలో ఉన్నప్పుడు ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు కోరిన రామ్మోహ‌న్ నాయుడు, కేంద్ర మంత్రి అయిన త‌రువాత.. స్టీల్‌ప్లాంట్ గురించి క‌నీసం ప‌ట్టించుకోవ‌డం లేదని కార్మికులు విమ‌ర్శిస్తున్నారు.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌రజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner