విశాఖపట్నంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ప్రేమ, పెళ్లి పేరుతో మాయ మాటలు చెప్పి అమ్మాయిలతో కొంత మంది యువకులు స్నేహం చేస్తున్నారు. ఆపై వారికి మత్తు మందు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయిన తరువాత అత్యాచారం చేస్తారు. అత్యాచార ఘటనలను వీడియోలు తీసి, బెదిరింపులకు దిగుతున్నారు. ఇలాంటి తరహా ఘటనలో మోసపోయిన బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఆ యువకుల ముఠా గుట్టు రట్టు అయింది.
ఈ ఘటన విశాఖపట్నంలోని నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన యువకుడు రవీంద్రతో పాటు మరికొంత మంది యువకుల ముఠా మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, టూవీలర్ రైడ్ యాప్ పేరుతో పెళ్లికాని యువతుల నుంచి వివరాలు సేకరిస్తోంది. ఆపై సంబంధాలు, ప్రొడెక్టులను చూపించే వంకతో పరిచయాలు పెంచుకుంటోంది. కూల్ డ్రింక్ లో మత్తు మందు ఇచ్చి యువతులు స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేస్తున్నారు. అలాగే అత్యాచారం చేసే ఘటనను వీడియోలు తీసి, ఆపై ఆ వీడియోలతో యువతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
బాధితుల్లో ఒక యువతి ఈ ముఠా గుట్టును రట్టు చేసింది. దొండపర్తికి చెందిన యువతి విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రవీంద్రతో పాటు మరికొంత మంది యువకులు ప్రేమ పేరుతో నమ్మించి మోసానికి పాల్పడుతన్నారని పేర్కొంది. మ్యారేజ్ బ్యూరో పేరుతో అమ్మాయిలను వలలో వేసుకుని, వారివద్ద నుంచి నగదు తీసుకుని శారీరకంగా వేధించి వీడియోలు తీస్తు్న్నారని తెలిపింది. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు దిగుతున్నారని పేర్కొంది.
ఇప్పటి వరకు 30 మంది యువతుల నగ్న వీడియోలను సేకరించి బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు చెబుతోంది. ఒకవేళ గర్భం దాలిస్తే బలవంతంగా అబార్షన్లు చేయిస్తున్నారు. గర్భం దాల్చిన తననూ అబార్షన్ చేయించుకోవాలని ఆ ముఠా ఒత్తిడి చేసిందని, లేకుంటే సుపారీ ఇచ్చి చంపేయిస్తామని బెదిరింపులకు దిగారని బాధితులరాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని పోలీసులు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పోలీసుల నుంచి తనకు న్యాయం జరగడం లేదంటూ బాధితురాలు మీడియా ముందు వాపోయింది.
అయితే శుక్రవారం రాత్రి ఆమె ఫిర్యాదు చేసిందని, ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నాలుగో పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తి అయిన తరువాత అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే పూర్తి వివరాలు మీడియాకు ముందుకు తీసుకొస్తామని అన్నారు. మరోవైపు బాధిత యువతి ఆ ముఠా ఆగడాలను కట్టడి చేసి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం