Visakha Railway Zone : విశాఖకు ప్రధాని మోదీ, రైల్వేజోన్‌ శంకుస్థాపన తూచ్….-visakha railway zone foundation programme cancelled with political reasons ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Visakha Railway Zone Foundation Programme Cancelled With Political Reasons

Visakha Railway Zone : విశాఖకు ప్రధాని మోదీ, రైల్వేజోన్‌ శంకుస్థాపన తూచ్….

HT Telugu Desk HT Telugu
Nov 11, 2022 07:12 AM IST

Visakha Railway Zone ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో రైల్వేజోన్‌ అంశాన్ని తప్పించారు. ప్రధాని రైల్వేజోన్‌కు శంకుస్థాపన చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కొద్ది వారాల క్రితం ప్రకటించారు. అప్పటికి ప్రధాని పర్యటన గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నవంబర్ 12న విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందని సాయిరెడ్డి ప్రకటించారు. దీనిపై బీజేపీ నేతలు కినుక వహించారు. తమకు రావాల్సిన క్రెడిట్ అధికార పార్టీ కొట్టేస్తోందని భావించారు. ఏం జరిగిందో కానీ ప్రధాని పర్యటనలో రైల్వే జోన్ అంశం మాయమైంది.

రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తామని ప్రకటించిన జివిఎల్
రైల్వే జోన్ శంకుస్థాపన కార్యక్రమాన్ని మరోసారి నిర్వహిస్తామని ప్రకటించిన జివిఎల్

Visakha Railway Zone ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో పలు జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం తమిళనాడులోని మధురై నుంచి విశాఖపట్నం వచ్చే ప్రధాని నరేంద్ర మోదీ శనివారం దాదాపు రూ.15వేల కోట్ల రుపాయలతో చేపడుతున్నప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టినజాతీయ రహదారులు, రైల్వే లైన్లనిర్మాణం, ఓఎన్జీసీ, గెయిల్, హెచ్‌పిసిఎల్‌ వంటి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ప్రధాని పర్యటనలో విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్‌కు శంకుస్థాపన కూడా ఉంటుందని ఎంపీ సాయిరెడ్డి ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు

విశాఖపట్నం రైల్వే జోన్ కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కావాల్సిన రైల్వే జోన్‌ విషయంలో బీజేపీ సంకట స్థితిని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో రైల్వే జోన్‌కు ప్రధాని శంకుస్థాపన చేస్తారనే ప్రకటన సాయిరెడ్డి చేయడం, బీజేపీకి నచ్చలేదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. విశాఖలో ప్రధాని పర్యటనలో శంకు స్థాపన చేసే ప్రాజెక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు కాబట్టి ఆ క్రెడిట్ తమకు దక్కాలని బీజేపీ భావించింది.

విభజన హామీలను బీజేపీ నిలబెట్టుకోలేదని తరచుగా విమర్శలను ఎదుర్కోంటోంది. ఈ క్రమంలో ప్రధాని పర్యటనను సైతం అధికార వైసీపీ హైజాక్‌ చేసేలా వ్యవహరించడం బీజేపీ నేతలకు రుచించలేదు. ప్రధాని పర్యటన ద్వారా తమ పార్టీకి రావాల్సిన మైలేజీ దక్కడం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు భావించారు. వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను పక్కన పెట్టి అంతా తామై వ్యవహరిస్తున్నారని భావించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే ప్రాజెక్టులను తమ ఘనతగా ప్రచారం చేసుకుంటోందని భావించిన బీజేపీ నేతలు రైల్వే జోన్ విషయంలో ఢిల్లీలో చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని తమ పార్టీ పెద్దలకు వివరించారు. విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన వంటి కార్యక్రమాన్నిరాష్ట్రానికి బీజేపీఇచ్చిన కానుకగా వివరించేందుకు వాడుకోవాలని ఆ పార్టీ నేతలు భావించారు.

రాజకీయ కార్యక్రమాలు కాదంటూనే…..?

విశాఖపట్నంలో ప్రధాని పర్యటనలో జరిగేది రాజకీయ కార్యక్రమాలు కాదని బీజేపీ, వైసీపీలు చెబుతున్నా వాస్తవానికి ఎంపీ సాయిరెడ్డి ముందస్తు ప్రకటన వల్లే ఈ మొత్తం వ్యవహారం బెడిసికొట్టిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కేంద్రం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి మేలు చేసే విషయంలో బీజేపీ ఎక్కడా అన్యాయం చేయకపోయినా, అధికార వైసీపీ మాత్రం తమ వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు వస్తున్నాయని ప్రచారం చేసుకుంటోందని బీజేపీ భావిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రధాని విశాఖ పర్యటనలో శంకుస్థాపనల జాబితా నుంచి రైల్వే జోన్ అదృశ్యమైంది. విశాఖపట్నం నుంచి బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీజేపికి లబ్ది చేకూర్చేలా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో పాగా వేసేందుకు అవసరమైన కార్యాచరణను ఇప్పటికే సిద్ధం చేసుకుంటున్నారు.

రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులను ఎన్నికల నాటికి దశల వారీగా ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

IPL_Entry_Point