Visakha Metro Rail: విశాఖ మెట్రో సమగ్ర రవాణా ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉందని ఏపీ అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో విశాఖపట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు,పీజీవీఆర్ నాయుడు,వెలగపూడి రామకృష్ణ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిచ్చారు.
2014 విభజన చట్టంలోని 13వ షెడ్యూల్ ఐటం 12 ప్రకారం విజయవాడ,విశాఖకు మెట్రో రైలుపై సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ ఇవ్వాలని పొందుపరిచారు.దీని ప్రకారం 2014లో డీపీఆర్ సిద్దం చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కు నాటి టీడీపీ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిందని 2015లోనే డీఎంఆర్సీ ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందించిందని నారాయణ పేర్కొన్నారు
విశాఖపట్నంకు సంబంధించి 42.5 కిమీల నెట్ వర్క్ తో మూడు కారిడార్లతో మీడియం మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చారని 2019 ఏప్రిల్ లో టెండర్లు పిలవగా కొన్ని కంపెనీలు బిడ్లు కూడా దాఖలు చేసాయన్నారు.అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసి ఉంటే విశాఖపట్నంతో పాటు విజయవాడకు మెట్రో రైలు వచ్చి ఉండేదని, విశాఖపట్నంలో భోగాపురం వరకూ పొడిగింపు సాకుతో ప్రాజెక్ట్ ను పెండింగ్ లో పెట్టేసారని మంత్రి నారాయణ తెలిపారు.
తిరిగి 2020 మార్చి 19 వ తేదీన గుర్గాంకు చెందిన వీఎంటీసీ అనే కంపెనీకి విశాఖ మెట్రో డీపీఆర్ బాధ్యతలు అప్పగించగా మొత్తం 76.9కిమీతో రూ.14,300 కోట్ల ఖర్చుతో నాలుగు కారిడార్లలో ఏర్పాటుకు డీపీఆర్ ఇచ్చిందన్నారు.2021 ఏప్రిల్ లోనే డీపీఆర్ ఇచ్చినప్పటికీ 2023 డిసెంబర్ 15వ తేదీ వరకూ వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కలకత్తా మెట్రో రైల్ తరహాలో వందశాతం కేంద్ర ప్రభుత్వం భరించేలా రైల్వే శాఖకు అప్పగించేలా కేంద్రం ముందు ప్రతిపాదన ఉంచామన్నారు.దీనికి సంబంధించి స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రికి లేఖ ఇవ్వడంతో పాటు సీఎం చంద్రబాబు కూడా ప్రధాని మోడీకి లేఖ రాసారని చెప్పారు.
రెండు దశల్లో నాలుగు కారిడార్లలో మెట్రో ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. మొదటి దశలో 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో నిర్మాణం చేస్తామన్నారు.