Minor Girl Issue: వెధవ పనికి ఎమ్మెల్యే వత్తాసు..మండిపడుతున్న న్యాయవాదులు
Minor Girl Issue: విజయవాడలో ఓ ఎమ్మెల్యే నిర్వాకం చర్చనీయాంశంగా మారింది. మైనర్ బాలికతో బాలుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో బాధితులపైనే కేసు నమోదు చేయడం కలకలం రేపింది. ప్రజా ప్రతినిధి జోక్యంతో భవానీపురం పోలీసులు న్యాయవాదిపై కేసు నమోదు చేశారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Minor Girl Issue: పార్కులో ఆడుకుంటున్న ఐదో తరగతి చదివే బాలికతో పదో తరగతి చదువుతున్న బాలుడు అసభ్యంగా ప్రవర్తించాడు. భయపడిన బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ బాలుడి ఇంటికెళ్లి గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు చెబుతున్నారు. బాలుడి నిర్వాకంపై బాధితురాలి తండ్రి పోలీసుల్ని ఆశ్రయించినా, కేసు నమోదు చేయకుండా బాలుడి కుటుంబం నుంచి దాడి చేసినట్లు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేసినట్లు న్యాయవాదులు ఆరోపిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలోని భవానిపురంలో ఉన్న వెల్లంపల్లి కాలనీకి చెందిన బాలిక మార్చి 5వ తేదీన స్థానికంగా ఉన్న పార్కులో ఆడుకుంటున్న సమయంలో అదే కాలనీ చెందిన బాలుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాను ఏమి చేశానో ఎవరికి చెప్పొద్దంటూ బాలికను బెదిరించాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇంటికెళ్లిన బాలిక ముభావంగా ఉండటం, ఏడుస్తుండటంతో తల్లిదండ్రులు ఆరా తీయడంతో ఏమి జరిగిందో ఆరా తీశారు.
బాలిక చెప్పిన సమాచారంతో న్యాయవాదిగా పనిచేసే ఆమె తండ్రి, మరో ముగ్గురితో కలిసి బాలుడి ఇంటికి వెళ్లి అతనిపై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ప్రత్యర్థులు కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. బాలుడి కుటుంబం స్థానిక ప్రజా ప్రతినిధిని ఆశ్రయించారు. ఏ ఒత్తిళ్లు పని చేశాయో కాని బాలిక తండ్రి, అతని స్నేహితులు బాలుడి తల్లి, సోదరుడిపై కర్రలతో దాడి చేశారని పోలీసులు మొదటి కేసు నమోదు చేశారు.
బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్లు మొదట తాము ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా తమపై కేసు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడితోనే కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు. బాలిక తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా తాత్సారం చేసిన పోలీసులు మహిళా పోలీస్ స్టేషన్కు వెళ్లాలని ఉద్దేశపూర్వకంగా ఆలశ్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము మొదట ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా రాత్రి 11.45 నిమిషాలకు బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై Cr.No.164/2023 U/s 341, 324, 354 R/W 34 IPC కేసు నమోదు చేసి వారిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
మరోవైపు బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదుపై ఆరో తేదీ రాత్రి రెండు గంటల తర్వాత కేసు నమోదు చేశారు. స్థానికంగా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నా దిశా పోలీస్ స్టేషన్కు పంపి తెల్లవారుజామున 02.00 గంటలకి Cr.No.19/2023 U/s 354(A) IPC & Sec 8 of POSCO Act గా కేసు నమోదు చేశారు.
కేసు పెట్టడానికి వెళ్లిన బాధిత కుటుంబంపైనే విజయవాడ పోలీసులు ఎదురు కేసు పెట్టడంపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మహిళా సంఘాలు, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. ప్రజా ప్రతినిధి జోక్యంతోనే పోలీసులు కేసు నమోదు చేయకుండా బాధితుల్ని స్టేషన్ల చుట్టూ తిప్పారని ఆరోపిస్తున్నారు. బాధితులని కేసు పెట్టకుండా నీరుగార్చడానికే ఎమ్మెల్యే ప్రోద్భలంతో తప్పుడు కేసు పెట్టించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లే కారణమని ఆరోపిస్తున్నారు.