Chandrababu : తుపాను సన్నద్ధతలో ప్రభుత్వం విఫలం, బాధితులకు భోజనాలు కూడా పెట్టడంలేదు- చంద్రబాబు-vijayawada news in telugu tdp chandrababu criticizes ysrcp govt no early preparation on cyclone relief works ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu : తుపాను సన్నద్ధతలో ప్రభుత్వం విఫలం, బాధితులకు భోజనాలు కూడా పెట్టడంలేదు- చంద్రబాబు

Chandrababu : తుపాను సన్నద్ధతలో ప్రభుత్వం విఫలం, బాధితులకు భోజనాలు కూడా పెట్టడంలేదు- చంద్రబాబు

Chandrababu : తుపాను సన్నద్ధతలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. బాధితులకు కనీసం భోజనాలు కూడా ఏర్పాటుచేయలేకపోయిందన్నారు.

చంద్రబాబు

Chandrababu : తుపాను బాధితులకు తక్షణ అవసరం అయిన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుపానుపై ప్రభుత్వ సన్నద్ధతా లేదని, బాధితులకు సాయం కూడా అందడంలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మిచౌంగ్ తుపాను బాధిత గ్రామాలకు చెందిన కొందరు ప్రజలతో చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. తమకు కనీసం భోజనం కూడా పెట్టేలేదని, ప్రభుత్వ స్పందన సరిగా లేదని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు చంద్రబాబుకు చెప్పారు. తుపాను ప్రభావంపై దాదాపు 12 వేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులపై నాయకులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఉన్న నాయకుల ద్వారా పలు గ్రామాల ప్రజలతో మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకున్నారు.

బాధితులకు అండగా నిలవండి

ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూడకుండా....పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధిత ప్రజలకు అండగా ఉండాలని చంద్రబాబు సూచించారు. బాధితులకు వెంటనే భోజనం, తాగునీరు అందేలా చూడాలని నేతలకు చెప్పారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని....ఈ కష్ట సమయంలో చేతనైన సాయం ద్వారా ప్రజలకు అండగా నిలవాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా, చేతలు గడప దాటడం లేదని చంద్రబాబు విమర్శించారు. దీనికి క్షేత్ర స్థాయి పరిస్థితులే నిదర్శనం అని మండిపడ్డారు. ఈ స్థాయి విపత్తు అని ముందే తెలిసినా...ప్రజలను అలెర్ట్ చేయడంలో విఫలం అయ్యారని, వ్యవస్థల నిర్వీర్యం వల్లనే నేడు ఈ దుస్థితి అన్నారు.

హుద్ హుద్, తిత్లీ తుపాన్ల సమయంలో ప్రత్యేక జీవోలతో సాయం

విపత్తుల సమయంలో రైతులను ఆదుకోవడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యేక జీవోలు ఇచ్చి సాయం అందించామని చంద్రబాబు అన్నారు. హుద్ హుద్ సమయంలో జీవో నెంబర్ 9 ద్వారా, తిత్లీ తుఫాన్ సమయంలో జీవో నెంబర్ 14 ద్వారా పరిహారం పెంచి రైతులకు అండగా నిలబడ్డామన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం లెక్కలు వేసుకోకుండా ఉదారంగా వ్యవహరించాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో విపత్తుల సమయంలో సాయం పెంచి ఎలా ఇచ్చిందీ....వైసీపీ ప్రభుత్వం ఎలా కోతలు పెట్టిందీ అనే విషయాన్ని నేతలకు చంద్రబాబు వివరించారు. నాటితో పోల్చుకుంటే నేడు పెరిగిన సాగు ఖర్చులు, ఇతర భారాలను దృష్టిలో పెట్టుకుని పరిహారం మరింత పెంచి ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు టీడీపీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.