AP AHA Notification 2023 : ఏపీ పశుసంవర్థక శాఖలో 1896 పోస్టుల భర్తీ, దరఖాస్తులకు డిసెంబర్ 11 చివరి తేదీ
AP AHA Notification 2023 : ఏపీ పశుసంవర్థక శాఖలో 1896 పోస్టుల భర్తీలో నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి డిసెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
AP AHA Notification 2023 : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పశుసంవర్థక శాఖలో 1896 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ విడుదలైంది. సచివాలయాలకు అనుబంధంగా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో పశు సంవర్థక సహాయకులు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. నవంబర్ 20వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు వయోపరిమితి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజును డిసెంబర్ 10వ తేదీలోపు చెల్లించాల్సి ఉంటుంది.
ట్రెండింగ్ వార్తలు
డిసెంబర్ 31న రాత పరీక్ష
ఈ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డిసెంబర్ 27న రాత పరీక్షకు హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. డిసెంబర్ 31న ఆన్ లైన్ ద్వారా రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు జనవరిలో జాయినింగ్ లెటర్స్ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మొదట రెండేళ్ల పాటు ప్రొబేషన్ ఉంటుంది. ప్రొబేషన్ సమయంలో రూ.15 వేల చొప్పున చెల్లిస్తారు. అనంతరం నెలకు రూ.22, 460 జీతం చెల్లిస్తారు.
వయో పరిమితి
నవంబర్ 20, 2023 నాటికి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 42 సంవత్సరాలుగా ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు ఉంది.
జీతం వివరాలు
అర్హులైన అభ్యర్థులకు రూ.14,800 నుంచి రూ.44,980 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం
ఆన్ లైన్ ద్వారా రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్
విద్యార్హతలు
వెటర్నరీ సైన్సెస్/యానిమల్ హస్బెండరీ వృత్తి విద్యా కోర్సు లేదా డిప్లొమా లేదా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు
జిల్లాల వారీగా ఉద్యోగాల వివరాలు
పశ్చిమ గోదావరి జిల్లాలో 102, తూర్పు గోదావరి జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 473, చిత్తూరు జిల్లాలో 100, కర్నూలు జిల్లాలో 252, కడప జిల్లాలో 210, గుంటూరు జిల్లాలో 229, కృష్ణా జిల్లాలో 120, నెల్లూరు జిల్లాలో 143, ప్రకాశం జిల్లాలో 177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు విశాఖపట్నం జిల్లాలో 28, విజయనగరం జిల్లాలో 13, శ్రీకాకుళం జిల్లాలో 34 పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఏపీ ప్రభుత్వం సచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటిల్లో 9,844 పశు సంవర్థక సహాయకులు అవసరమని గుర్తించింది. ఇందుకుగాను రెండు విడతల్లో 4,643 ఆర్బీకేల్లో వీఏహెచ్ఏ పోస్టులను భర్తీ చేసింది. తాజాగా ఆర్బీకేల్లో మిగిలిన 1,896 వీఏహెచ్ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.