AP Voters List : మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం, కొత్త ఓటర్ల నమోదుకు డిసెంబర్ 9 వరకు ఛాన్స్ - సీఈవో ఎంకే మీనా-vijayawada ceo mukesh kumar meena says ap assembly elections notification likely in 2024 march ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Voters List : మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం, కొత్త ఓటర్ల నమోదుకు డిసెంబర్ 9 వరకు ఛాన్స్ - సీఈవో ఎంకే మీనా

AP Voters List : మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం, కొత్త ఓటర్ల నమోదుకు డిసెంబర్ 9 వరకు ఛాన్స్ - సీఈవో ఎంకే మీనా

AP Voters List : వచ్చే ఏడాది మార్చిలో ఏపీ సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు, సవరణలకు డిసెంబర్ 9 వరకు అవకాశం కల్పించామన్నారు.

సీఈవో ముకేష్ కుమార్ మీనా

AP Voters List : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైంది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మార్చిలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందన్నారు. తాజా జాబితా ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,02,21,450 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఇందులో మార్పుచేర్పుల అనంతరం 2024 జనవరి 5 నాటికి పూర్తి స్థాయి ఓటర్ల జాబితా రూపొందిస్తామన్నారు. ఓటర్ల జాబితాలో.. కొత్త ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగింపు, ఓట్లు బదిలీ వంటి చర్యలు చేపట్టామన్నారు. ఓటర్ల జాబితా ముసాయిదాను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామన్నారు. ఎవకైనా అభ్యంతరాలుంటే డిసెంబరు 9 లోపు తెలియజేయవచ్చన్నారు. డిసెంబరు 26 నాటికి జాబితాలో సమస్యలు పరిష్కరించి, వచ్చే ఏడాది జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు.

10 లక్షల బోగస్ ఓట్లు తొలగించాం

రాష్ట్రంలో సుమారు 10 లక్షల బోగస్ ఓట్లను తొలగించామని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. రాజకీయ పార్టీలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించామన్నారు. మొత్తం ఆరు అంశాల ఆధారంగా అభ్యంతరాలు పరిశీలిస్తున్నామన్నారు. ఫేక్ ఓట్ల తొలగింపు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందన్నారు. తెలంగాణ, ఏపీ రెండు చోట్లు ఓటు వేస్తున్నారని తమ దృష్టి వచ్చిందన్నారు. ఓటు బదిలీ చేసుకుంటేనే వారికి అవకాశం ఇవ్వాలని ఆదేశించామన్నారు. అయితే రెండు రాష్ట్రాలో ఓటు హక్కు ఉన్న విషయాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో లేదన్నారు. ఏపీలో ఉన్నవాటిని గుర్తించే సాఫ్ట్‌వేర్‌ మాత్రమే అందుబాటులో ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణలో ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్‌లైన్‌ లో ఫిర్యాదు చేసిన స్పందిస్తామన్నారు. భెల్‌ కంపెనీ రూపొందించిన ఈవీఎంలు వచ్చాయని, వీటి పనితీరును రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలిస్తామన్నారు.

డిసెంబర్ 9 వరకు కొత్త ఓటర్ల నమోదు

ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పై అభ్యంతరాలు, సవరణలకు డిసెంబరు 9వ తేదీ వరకు అవకాశం ఇచ్చామని సీఈవో ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ ల వద్ద ఇందుకు రెండుసార్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. నవంబరు 4, 5, డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో ఓటర్ల అభ్యంతరాలు, సవరణలకు అప్లై చేసుకోవచ్చన్నారు. అదే విధంగా కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసు నిండిన వారు డిసెంబరు 9 వరకు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అదేవిధంగా 2024 ఏప్రిల్‌ లేదా జులై లేదా అక్టోబరు 1వ తేదీనాటికి 18 ఏళ్లు నిండిన వారైనా ఓటు హక్కు కోసం ముందస్తు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆన్ లైన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.