Vijayasai Reddy : రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా.. టీడీపీ రియాక్షన్ ఇదే!
Vijayasai Reddy : వైసీపీ తరఫున పెద్దల సభకు వెళ్లిన విజయసాయి రెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు శుక్రవారం రాత్రి ఎక్స్ వేదికగా విజయసాయి ప్రకటించారు. ఆ తర్వాతి రోజే రాజీనామా చేశారు. దీనిపై టీడీపీ రియాక్ట్ అయ్యింది. విమర్శలు గుప్పించింది.
రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు రాజీనామా పత్రాన్ని సమర్పించారు.తాను రాజకీయాలకు గుడ్బై చెబుతున్నట్లు శుక్రవారం రాత్రి విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని.. ఎలాంటి ఒత్తిళ్లూ లేవని ట్వీట్ చేశారు.

విజయసాయి పోస్ట్ ఏంటీ..
'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కు, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
జగన్కు మంచి జరగాలని..
'జగన్కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు' అని వ్యాఖ్యానించారు.
పవన్తో స్నేహం..
'టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
టీడీపీ రియాక్షన్..
విజయసాయి ప్రకటనపై టీడీపీ స్పందించింది. ఇలాంటి ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ఉంటే.. ఆర్థిక ఉగ్రవాదులుగా మారే ప్రమాదం ఉంటుందని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల నుంచి బయటికి తప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి నేతలు పేర్లు చెప్పడం ద్వారా తనకు అందరూ తెలుసనే ప్రచారం చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.