ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నోటీసులు అందుకున్న ఆయన… ఇవాళ విజయవాడలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు. పార్టీలోని కొందరు పెద్దలు రాజ్ కసిరెడ్డిని తనకు పరిచయం చేశారని వెల్లడించారు. రాజ్ కసిరెడ్డిని తాను ఎంకరేజ్ చేసిన మాట వాస్తవమే అని వ్యాఖ్యానించారు. అతను ఇంత దారుణంగా మోసం చేశాడంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.
“రాజ్ కసిరెడ్డిని నేను ఎంకరేజ్ చేసిన మాట వాస్తవమే. పార్టీలోని కొందరు పెద్దలు రాజ్ కసిరెడ్డిని నాకు పరిచయం చేశారు. ఆయన ఒక తెలివైన క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి. అతను క్రిమినల్ అని తెలియక నేను అతన్ని ఎంకరేజ్ చేశాను. వైసీపీలో రాజ్ కసిరెడ్డికి అత్యంత కీలకమైన బాధ్యతలు నేనే అప్పగించాను. అతను నన్ను ఇంత దారుణంగా మోసం చేశాడంటే నాకే ఆశ్చర్యం కలుగుతోంది” అని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు.
ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర గురించి తనకు తెలియదని విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాజ్ కసిరెడ్డి మాత్రమే అన్నింటికీ సమాధానం చెప్పగలరని తెలిపారు. లిక్కర్ విక్రయాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు.
“రాజ్ కసిరెడ్డి వసూలు చేసినవి ఎవరికి వెళ్లాయో నాకు తెలియదు. అరబిందో దగ్గర రూ.వంద కోట్లు అప్పుగా ఇప్పించా. 12 శాతం వడ్డీకి చెల్లింపులు జరిగేలా అప్పు ఇప్పించా. డీకార్ట్, అడాన్ కంపెనీలకు అప్పులు ఇప్పించాను. ఇందుకు సంబంధించిన వివరాలను సిట్ కు చెప్పా. మరోసారి పిలిచినా వస్తానని సిట్ అధికారులకు చెప్పా” అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 2 స్థానం ఉండదని విజయసాయిరెడ్డి కామెంట్స్ చేశారు. “పార్టీ అధికారంలో లేని సమయంలో అన్నీ నేనే చూసుకున్నా. అధికారంలోకి వచ్చాక నెంబర్ 2 అనేది మిథ్యగా భావించా. నేను వెన్నుపోటు దారుడనని జగన్కు చెప్పారు. 2వ స్థానం నుంచి నేను 2000 స్థానానికి పడిపోయా. వైసీపీలో ఎన్నో అవమానాలు అనుభవించాను” అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
“రాజ్యసభ పోటీలో నేను లేను. ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తా. కోటరీ వల్లే బాధతో పార్టీని వీడా.. నేను పెట్టించిన ఛానల్లో అనవసరంగా విమర్శలు చేశారు. నేను వ్యవసాయం చేస్తాను.. ఇంకా ఏమైనా చేస్తాను..సాక్షి మీడియా ఎందుకు అనవసర రాతలు…? మద్యం స్కామ్లో బిగ్బాస్ ఉన్నాడా.. లేడా నాకు తెలియదు” అంటూ విజయసాయిరెడ్డి కొన్ని ప్రశ్నలకు బదులిచ్చారు.