Vande Bharath Express : విశాఖలో వందే భారత్ రైలుపై రాళ్లు విసిరిన ఆకతాయిలు
Vande Bharath Express : విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రైలులోని 2 కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.
Vande Bharath Express : విశాఖలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై ఆకతాయిలు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో రైలులోని 2 కోచ్ ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు... ఆకతాయిలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై రైల్వే చట్టం ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు... ధ్వంసమైన అద్దాలను మార్చి.. వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు సిద్ధమవుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మంజూరైన తొలి వందే భారత్ రైలు... సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య పరుగులు పెట్టేందుకు రెడీ అయింది. జనవరి 19న ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ట్రయల్ రన్ కోసం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు బుధవారం చెన్నై నుంచి విశాఖపట్నం చేరింది. రైలు వేగం, ట్రాక్ తదితర అంశాలపై రైల్వే అధికార పరిశీలన పూర్తయన తర్వాత... రైలు విశాఖ నుంచి మర్రిపాలెంలో కోచ్ నిర్వహణ కేంద్రానికి బయలు దేరింది. కంచరపాలెం రామ్మూర్తి పంతులు పేట వద్దకు రాగానే కొందరు ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరారు. దీంతో... 2 కోచ్ అద్దాలు ధ్వంసమయ్యాయి.
"ట్రైల్ రన్ పూర్తియిన తర్వాత బుధవారం సాయంత్రం 6 : 30 గంటలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి కోచ్ కాంప్లెక్స్ కి బయలు దేరింది. కొంత దూరం వెళ్లగానే.. కొందరు ఆకతాయిలు.. రైలుపై రాళ్లు రువ్వారు. ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు" అని డీఆర్ఎం అనూప్ తెలిపారు.
దేశ వ్యాప్తంగా పలు రూట్లలో వందే భారత్ రైళ్లు ఇప్పటికే మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల మధ్య తొలి రైలు ప్రారంభం కావాల్సి ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న దురంతో రైలు కంటే వందే భారత్ వేగంగా గమ్య స్థానాలకు చేరనుంది. ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న దురంతో ఎక్స్ప్రెస్ గరిష్టంగా 10గంటల్లో గమ్యస్థానాన్ని చేరుతోంది. వందే భారత్ రైలు 8 గంటల 40 నిమిషాల వ్యవధిలోనే గమ్య స్థానానికి చేరుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దురంతో ఎక్స్ప్రెస్తో పోలిస్తే గంటన్నర ముందే ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు వీలవుతుంది.