వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలింది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో వంశీపై పీటీ వారెంట్ కు నూజివీడు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీని తమ ముందు హాజరు పరచాలని నూజివీడు కోర్టు పోలీసులను ఆదేశించింది.
వల్లభనేని వంశీపై ఇప్పటికే ఆరు కేసులు నమోదు అయ్యాయి. కిడ్నాప్ కేసులో తాజాగా బెయిల్ రాగా...గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో రేపు తీర్పు వెలువడనుంది. ఇప్పటికే ఐదు కేసుల్లో బెయిల్, ముందస్తు బెయిల్ వచ్చింది. ఒకవేళ రేపు వంశీకి బెయిల్ వచ్చినా ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొంది.
నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీని రేపు నూజివీడు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
బాపులపాడులో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వైసీపీ నేత వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ నూజివీడు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఈ కేసులో కోర్టు పీటీ వారెంట్ కు అనుమతి ఇచ్చింది. రేపు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినా, ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలులో తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తు్న్నారు. ఈ విషయం బయటకు తెలియడంతో వంశీని పరామర్శించేందుకు వైసీపీ శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా వచ్చినట్లు సమాచారం.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ మోహన్ కు విజయవాడలోని ఎస్సీ,ఎస్టీ కోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వంశీతో పాటు మరో నలుగురికి ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ పై రేపు తీర్పు వెలువడనుంది.
వల్లభనేని వంశీ శ్వాస సంబంధిత సమస్యలపై బాధపడుతున్నారు. మంగళవారం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఆయన వైద్య పరీక్షలు నిర్వహించారు. తనకు నాలుగు రోజుల కిందట జైలులో కళ్లు తిరిగాయని వైద్యులకు చెప్పడంతో పలు రకాల పరీక్షలు నిర్వహించారు.
అన్నింటిలో సాధారణంగానే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అరెస్టైన రోజు నుంచి ఇప్పటి వరకు వంశీ 20 కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. వైద్యులు నివేదికను పోలీసులు కోర్టుకు అందించారు.
సంబంధిత కథనం