సుదీర్ఘ కాలం తర్వాత ఏపీ డీజీపీ ఎంపికపై ప్యానల్ మీటింగ్ జరుగుతోంది. యూపీఎస్సీ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన జాబితా నుంచి ముగ్గురి పేర్లను ప్యానల్ ఎంపిక చేస్తుంది. కేంద్రం సిఫార్సు చేసిన వారిలో ఒకరికి డీజీపీ అవకాశం లభిస్తుంది.
ఏపీలో కొన్నేళ్లుగా పూర్తి స్థాయి డీజీపీల నియామకం చేయడం లేదు. రాజకీయ కారణాలతో కావాల్సిన వారిని డీజీలుగా నియమించే ఆనవాయితీ వైసీపీ హయంలో మొదలైంది. గౌతమ్ సవాంగ్ను తప్పించి కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించే సమయంలో పూర్తి అదనపు హోదాలో నియమించారు.
వైసీపీ హయంలో డీజీపీ రేసులో సీనియర్లు ఉన్నా రాజకీయ కారణాలతో రాజేంద్రనాథ్ రెడ్డికి అవకాశం దక్కింది. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈసీ ఆదేశాలతో హరీష్ కుమార్ గుప్తాను ఈసీ డీజీపీగా నియమించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో విఫలమయ్యారంటూ ఆయన్ని పక్కకు తప్పించారు. ప్రధాని పర్యటనలో భద్రత వైఫల్యం, ట్రాఫిక్ జామ్ లో విఐపిలు చిక్కుకుపోవడం వంటివి కారణాలుగా ప్రచారం జరిగింది. ఆయన స్థానంలో ద్వారకా తిరుమలరావుకు డీజీపీగా నియమించారు.
ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో తిరిగి హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమించారు. హరీష్ నియామకాన్ని యూపీఎస్సీ ప్యానల్తో ఖరారు చేయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఐదుగురి పేర్లతో కేంద్రానికి జాబితాను పంపారు.
బుధవారం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, యూపీఎస్సీ ప్రతినిధితో కూడిన కమిటీ డీజీపీ పదవి కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్యానెల్ జాబితాను పరిశీలించి డీజీపీ నియామకం కోసం ముగ్గురు పేర్లతో జాబితాను ఖరారు చేయనుంది.
ఈ భేటీ కోసం సీఎస్ కె.విజయానంద్ బుధవారం ఢిల్లీ వెళ్లారు . ప్రభుత్వం కేంద్రానికి పంపిన జాబితాలో ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు సీని యర్ ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, మాదిరెడ్డి ప్రతాప్, కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, అమిత్ గార్గ్ ఉన్నారు. అంజనీ కుమార్ కొద్ది రోజులు క్రితం తెలంగాణ నుంచి ఏపీకి వచ్చారు. ప్రస్తుతం జైళ్ల శాఖ డీజీగా ఉన్నారు.
కేంద్ర కమిటీ మూడు పేర్లను రాష్ట్రప్రభుత్వానికి పంపు తుంది. ముగ్గురిలో ఒకరిని ప్రభుత్వం డీజీపీగా ఖరారు చేస్తుంది. ప్రస్తుతం ఎఫ్ఏసిగా ఉన్న హరీష్ గుప్తానే పూర్తిస్థాయి డీజీపీగా ఎంపిక చేసే అవకాశాలు ఎక్కుగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పూర్తి బాధ్యతలు అప్పగిస్తే రెండేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. గత జనవరిలో ఆయన రెండోసారి డీజీపీ బాధ్యతలు చేపట్టారు.
సంబంధిత కథనం