ఆగని బెట్టింగ్‌ యాప్స్‌ దారుణాలు.. సత్యసాయి జిల్లా హిందూపురంలో యువకుడి ఆత్మహత్య..-unstoppable atrocities of betting apps youth commits suicide in hindupuram ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ఆగని బెట్టింగ్‌ యాప్స్‌ దారుణాలు.. సత్యసాయి జిల్లా హిందూపురంలో యువకుడి ఆత్మహత్య..

ఆగని బెట్టింగ్‌ యాప్స్‌ దారుణాలు.. సత్యసాయి జిల్లా హిందూపురంలో యువకుడి ఆత్మహత్య..

Sarath Chandra.B HT Telugu

ఏపీలో మరో యువకుడు బెట్టింగ్ యాప్స్‌ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన యువకుడు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. వరుస ఘటనలు జరుగుతున్నా బెట్టింగ్ యాప్స్‌ దారుణాలకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.

సత్యసాయి జిల్లాలో విషాదం, బెట్టింగ్ యాప్స్‌‌తో అప్పుల పాలై యువకుడి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ బెట్టింగ్ యాప్స్‌ దారుణాలు ఆగడం లేదు. వరుస ఘటనలు జరుగుతున్నా, వాటిని కట్టడి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా బలవన్మరణాలు మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక ప్రాంతాల్లో బెట్టింగ్ యాప్స్‌ వలలో చిక్కి యువకులు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు.

సత్యసాయి జిల్లాలో బెట్టింగ్ యాప్స్‌ ఉచ్చులో చిక్కుకుని యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యాప్స్‌లో ఆటల్లో చిక్కుకుని రూ.6 లక్షల వరకు అప్పులు చేసిన యువకుడు వాటిని తీర్చే మార్గం లేక రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు చేసిన అప్పుల్ని తీరుస్తామని భరోసా ఇచ్చినా తల్లిదండ్రులకు భారంగా మారాననే ఆవేదనతో యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు.

సత్యసాయి జిల్లాలో బెట్టింగ్ యాప్స్‌ వలలో చిక్కిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఇతరులు వాటి జోలికి పోవద్దంటూ లేఖ రాసి జేబులో పెట్టుకుని రైలు కింద పడి చనిపోయాడు. శ్రీసత్యసాయి జిల్లా హిందూపు రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని పరిగి మండలం పైడేటి గ్రామానికి చెందిన ఆదినారా యణ, వెంకటలక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దకుమారుడు వ్యవసాయం చేస్తుండగా, చిన్నకుమారుడు జయచంద్ర డిగ్రీ వరకు చదువుకున్నాడు.

తల్లిదండ్రులు ఆదినారాయణ, వెంకటలక్ష్మమ్మ గ్రామంలో పాలసేకరణ కేంద్రం నిర్వహిస్తున్నారు. చిన్న కొడుకు జయచంద్ర కొన్నేళ్లుగా ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. తల్లిదండ్రులు ఆడొద్దని వారించినా పట్టించుకోకుండా తెలిసిన వారి వద్ద, ఆన్‌లైన్‌ యాప్స్‌లో అప్పులు చేసి గేమ్స్ ఆడుతున్నాడు. వాటి మాయలో లక్షల్లో నష్ట పోవడంతో అప్పులు తీర్చడానికి ఏదైనా ఉద్యోగం చేద్దామని కొన్నిరోజుల క్రితం బెంగళూరు వెళ్లాడు. బెంగుళూరులో ఉద్యోగం రాక పోవడంతో కుంగిపోయాడు.

శనివారం రాత్రి బెంగుళూరు నుంచి స్వగ్రామానికి వచ్చేశాడు. ఇంటికి వెళ్లి తల్లి దండ్రులకు కనిపించలేక ఆదివారంతెల్లవారుజామున హిందూపురం సమీపంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోడానికి ముందు షర్టుపై ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడొద్దని చొక్కాపై రాసుకున్నాడు.

"ప్లీజ్ డోంట్ ప్లే ఆన్లైన్ గేమ్స్" అంటూ చీటీ మీద రాసి తన జేబులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. అప్పులు ఎంత ఉన్నా తాము కడతామని చెప్పామని, ఇంటికి రాకుండా ప్రాణాలు తీసుకున్నాడంటూ తల్లిదండ్రులు రోదించారు. ఈ ఘటనపై హిందూపురం రైల్వే ఎస్సై సజ్జప్ప కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం