AP Bjp : వైసీపీని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చిందని, కేంద్రం ఇస్తున్న పథకాలకు స్టిక్కర్లు వేయడం తప్ప రాష్ట్రంలో చేస్తున్నదేమి లేదని ఆరోపించారు. ఢిల్లీలో లిక్కర్ మాఫియా గుట్టు బయటపడినట్లే ఏపీలో లిక్కర్ మాఫియా డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయో బయటకు వచ్చే సమయం దగ్గరకు వచ్చిందన్నారు. యువ సంఘర్షణ యాత్ర ముగింపు కార్యక్రమంలో వైసీపీ లక్ష్యంగా బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఏపీలో లిక్కర్ కింగ్, స్టిక్కర్ కింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపే తరుణం వచ్చిందని, ఒకపుడు విదేశీ ఆక్రమణ దారులు వచ్చి ఈ దేశంలో మతం మార్చి, దోపిడి చేస్తే ఇపుడు ఏపీలో జగన్ అదే చేస్తున్నాడని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. ఏపీలో కొత్త పరిశ్రమలు రావటం లేదని, ఉన్న పరిశ్రమలు తరలిపోతుంటే ఉపాధి ఎలా వస్తుందని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
ట్రెండింగ్ వార్తలు
యూపీ జనాభా 25 కోట్లయితే అక్కడ పేదలకు 18 లక్షల ఇళ్లు కేటాయించిన మోదీ, ఏపీకి 21 లక్షల ఇళ్లు ఇస్తే జగన్ వాటిని పేదలకు అందకుండా చేస్తున్నారని ఆరోపించారు. సిఎం సొంత కడప జిల్లాలోనే 18 వేల ఇళ్లకి 870 మాత్రమే కట్టిన జగన్ ఇక మిగతా రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారన్నారు.
చంద్రబాబు, నేటి జగన్ ఇద్దరూ రాయలసీమ వారే అయినా రాయలసీమ యువత ఉపాధికోసం వలసపోవటం ఏమిటని ప్రశ్నించారు. నీరు కూడా ఇవ్వలేని వారు రాష్ట్రాన్ని పాలిస్తే ఫలితమేమిటన్నారు. ప్రతి ఇంటికీ కొళాయి నీటిని అందించాలని కేంద్రం నిధులిస్తే మూడేళ్లలో తన వాటా నిధులే జగన్ ఇవ్వలేదని, ఆయనకు పేదలపట్ల చిత్తశుద్ధికి అద్దం పడుతోందన్నారు.
వైకాపా అంటే కాంగ్రెస్ పార్టీకి కాపీ పార్టీ అని ఈ రాష్ట్ర ప్రభుత్వం మాఫియాల ప్రభుత్వం అని ఆరోపించారు. లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, ఇసుక మాఫియా, భూకబ్జాల మాఫియా అని, దీన్ని మాఫ్ కాదు సాఫ్ చేస్తామని ఠాకూర్ హెచ్చరించారు. ఢిల్లిలో ఆప్ సర్కారు భారీ లిక్కర్ కుంభకోణం చేసిందని, దాన్ని కేంద్రం బయటకు తీసిందని ఏ వన్ సిసోదియా అనే మంత్రి అయినా కింగ్ పిన్ మాత్రం కేజ్రీవాల్ అని ఆరోపించారు. 15 మంది మీద కేసులు నమోదైతే ఇద్దరు పరారీలో ఉన్నారని ఎవరిని వదిలే ప్రసక్తే లేద్నారు. ఏపీలోనూ లిక్కర్ మాఫియా మామూలు కుంభకోణం కాదని, జనం డబ్బులు ఎవరి జేబుల్లోకో పోతున్నాయని ప్రశ్నించారు.
ఏపీ గతంలో ఎలా ఉండేదని, ఎక్కడికి దిగజారిందని ప్రశ్నించారు. గంజాయి మాఫియా చేతిలో పడిందని, జగన్ గంజాయితో యువత జీవితాలు నాశనం చేయొద్దని, ఇతర రాష్ట్రాలకు సైతం ఈ గంజాయి పోతోందని, ఏపీకి అప్రతిష్ఠ చుట్టుకుంటోందని ఇకనైనా ఈ దందా ఆపాలన్నారు.
అవినీతిలో ఏపీ నాలుగో స్థానం, తెలంగాణ రెండో స్థానం అని సర్వేలు చెబుతున్నాయని, రెండు రాష్ట్రాలూ మొదటి స్థానానికి పోటీ పడుతున్నాయన్నారు. ఏపీలో ఆరోగ్యం అడుగంటిందని ఎక్కడ చూసినా డెంగీ జ్వరాలు అన్నారు. ఆరోగ్య శ్రీ అంటూ ఆయుష్మాన్ భారత్ అనే ప్రధాని పధకానికి స్టిక్కర్ వేశారని, కానీ ఏ లాభం లేదని, జనానికి వైద్యం దొరకటం లేదున్నారు.
కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇస్తున్నా మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకుండా ఆ పథకాలు అటక ఎక్కించేశారని ఆరోపించారు. విశాఖ కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, రెండు గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ పార్కులు, మెడ్ టెక్, ఫుడ్ పార్కులు, నేషనల్ ఇన్వెస్టుమెంట్ జోన్, రైల్వే ప్రాజెక్టులు... ఒకటా రెండా? ఎన్నెన్ని పథకాలు ఇచ్చినా జగన్ సర్కారు సద్వినియోగం చేయటం లేదన్నారు. యూపీలో అఖిలేష్ సర్కారు ఉండగా ఇలాగే కేంద్ర పథకాలను మూలన పడేశారని, యోగీ వచ్చాక అవి పట్టాలు ఎక్కాయన్నారు. ఎంతో అభివృద్ధి జరిగింది అందుకే చరిత్రను తిరగ రాస్తూ యోగీ మళ్లీ అధికారానికి వచ్చారన్నారు. ఏపీలోనూ బిజెపి రావాలని బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కుంభకోణాలకు పరిమితం అయ్యే కుటుంబ పార్టీల పాలన వద్దని ప్రగతికి ప్రతీక అయిన బిజెపి గెలుపునకు యువసంఘర్షణ యాత్రే నాంది అన్నారు.
టాపిక్