Instagram Fraud : ఇన్స్టా గ్రామ్లో వేషాలు… పెళ్లి పేరుతో మోసాలు…
Instagram Fraud సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో మోసాలకు పాల్పడుతున్న జంటను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్ టాక్లతో మొదలుపెట్టి, ఆ తర్వాత ఇన్స్టా గ్రామ్లో ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుని లక్షల్లో దండుకున్న యువతిని, ఆమె ప్రియుడిని కటకటాల వెనక్కి నెట్టారు. ఎనిమిది నెలల్లో ఓ యువకుడి నుంచి రూ.31లక్షల కాజేసినట్లు గుర్తించి పోలీసులు అవాక్కయ్యారు. sritinsu, Sri.tinsu,Lucky_sritinsu, Sri_tinsu పేర్లతో నిందితులు ఇన్స్టా గ్రామ్ అకౌంట్లను నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు రాచకొండ పోలీసులు ప్రకటించారు.
Instagram Fraud పెళ్లి పేరుతో యువకుల్ని మోసం చేస్తున్న ఓ యువతితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టిక్టాక్లో అందమైన అభినయంతో భారీగా పాలోవర్లను సంపాదించిన యువతి, టిక్టాక్ మూసేయడంతో ఇన్స్టా గ్రామ్లో ఖాతా తెరిచింది. ఒకటికి నాలుగు ఖాతాలతో భారీగా అనుచరుల్ని పోగేసింది. వాళ్లతో కబుర్లు చెబుతూ పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించేది. ఆ తర్వాత అవసరం కోసమంటూ లక్షల్లో వసూలు చేసేది.
ట్రెండింగ్ వార్తలు
పెళ్లి పేరుతో యువకుల్ని మోసం చేస్తున్న పరసా తనూశ్రీ అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాటకారితనం, అందమైన హావభావాలతో, క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ యువకుల్ని ముగ్గులోకి దింపడం అలవాటని పోలీసులు చెబుతున్నారు. sritinsu, Sri.tinsu,Lucky_sritinsu, Sri_tinsu అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రకటించారు.
టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లను పెంచుకున్న తనూశ్రీ అనే యువతి తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మోసాల బాటపట్టింది. పెళ్లి చేసుకుంటానంటూ వలపు వల విసిరి డబ్బు వసూలు చేయడం ప్రారంభించింది. ఆమెకు సహకరిస్తున్న పరసా రవితేజ అనే యువకుడిని కూడా అరెస్టు చేసినట్లు రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ తెలిపారు.
బాధితుల ఫిర్యాదుతో వెలుగు చూసిన మోసం….
ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నంకు చెందిన పరసా తనుశ్రీ గతంలో టిక్టాక్ వీడియోలు చేసేది. ఆ యాప్ను కేంద్రం రద్దు చేయడంతో ఇన్స్టాగ్రామ్లో నాలుగు ఖాతాలు తెరిచింది. ద్వారా సినిమా పాటలు, సంభాషణలు అనుకరిస్తూ వీడియోలు పోస్టు చేసేది. ఈ ఖాతాలను కొన్ని వేల మంది అనుసరిస్తూ కామెంట్లు చేసేవారు.
హైదరాబాద్లో కృష్ణా జిల్లాకు చెందిన పరసా రవితేజతో సహజీవనం చేస్తున్న తనూశ్రీ తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం అడ్డ దారులు తొక్కారు. వీరిద్దరు విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్లను మోసం చేయడం ప్రారంభించారు. తనుశ్రీ తన ఖాతాల్లో పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలకు కామెంట్లు పెట్టేవారికి తిరిగి వ్యక్తిగతంగా సందేశాలు పంపించేది.
చాటింగ్లో వలలో చిక్కిన వారిని పెళ్లి చేసుకుంటానంటూ కొంతకాలం నమ్మించి డబ్బు వసూలు చేసేది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తితో స్నేహం పెరిగాక అదనుగా తీసుకున్న యువతి పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అనంతరం తన తల్లికి అనారోగ్యంతో ఉందని చికిత్స కోసమని ఓసారి, ఇంటి ఈఎంఐ కట్టాలని మరోసారి, కొవిడ్ సోకిందని రకరకాలకారణాలు చెప్పి 8 నెలల్లో రూ.31.66 లక్షలు వసూలు చేసింది.
ఆమె ఫోన్లలో మాత్రమే మాట్లాడుతుండటంతో మోసం చేస్తోందని గ్రహించిన యువకుడు సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఆ యువతి పెళ్లి పేరుతో పలువుర్ని మోసం చేసినట్లు గుర్తించారు. గతంలో ఆమెపై మేడిపల్లి ఠాణాలోనూ కేసు ఉన్నట్లు గుర్తించారు. తనుశ్రీ, రవితేజ ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇద్దరి చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. ఈ జంట బారిన పలువురు యువకులు చిక్కినట్లు విచారణలో అంగీకరించారు. డబ్బులు పోగొట్టుకున్న వారు పోలీసుల్ని ఆశ్రయించకపోవడంతో వారు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. sritinsu, Sri.tinsu,Lucky_sritinsu, Sri_tinsu నాలుగు ఖాతాల్లో ఓ ఖాతకు దాదాపు 60వేల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం. సినిమా పాటలకు రీల్స్ చేస్తూ కామెంట్లు పెట్టే వారిని వలలో వేసుకోవడం ద్వారా మోసాలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.