Tirumala Drone Video Case: తిరుమల ‘డ్రోన్ వీడియో’ వివాదం…అసలు విషయం ఇదేనట!
Drone visuals of Tirumala temple: తిరుమల ఆలయానికి సంబంధించిన డ్రోన్ వీడియో ఒకటి కలకలం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై విచారిస్తున్న విజిలెన్స్ టీమ్… కీలక సమాచారాన్ని సేకరించింది. డ్రోన్ ఎగరవేసినవారిని గుర్తించింది.
Tirumala Drone visuals Viral: తిరుమల... ప్రపంచంలోనే అత్యంత ప్రముఖమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. అధ్యాత్మిక నగరిగా విరసిల్లుతోంది. ప్రపంచం నలుమూలాల నుంచి భక్తులు వస్తుంటారు. అలాంటి తిరుగిరుల్లో భారీ భద్రత ఉంటుంది. చీమ చిటుక్కుమన్నా ఇట్టే తెలిసిపోతుంది. తిరుమల కొండపై ఆంక్షలు కూడా అమల్లో ఉంటాయి. ముఖ్యంగా వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల కొండను ‘నో ఫ్లై జోన్’ గా ప్రకటించారు. విమానాలు, హెలికాప్టర్లకు ఆ కొండ పైనుంచి ఎగిరేందుకు అనుమతి లేదు. ఆగమశాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి అనుమతిలేదు. అలాంటి తిరుమల దేవాలయానికి సంబంధించిన ఓ డ్రోన్ వీడియో ప్రస్తుం ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడం కలకలం రేపుతోంది. దీనిపై విచారణ జరపగా… అసలు విషయాలు బయటికి వచ్చాయి.
ట్రెండింగ్ వార్తలు
సర్వే కోసం అనుమతి..!
సర్వే కోసం ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించటంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వివరాలు చూస్తే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో తిరుమలలో బయో గ్యాస్ ప్లాంటు ఏర్పాటుకు గతేడాది జూన్ 14న ఒప్పందం చేసుకుంది టీటీడీ. పలు అభివృద్ధి కార్యక్రమాలకు టీటీడీ ఇంజినీరింగ్శాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తిరుమలలో సర్వే బాధ్యతలను హైదరాబాద్కు చెందిన ఓ సంస్థకు అప్పగించింది తిరుమల తిరుపతి దేవస్థానం. డ్రోన్ ద్వారా సర్వే కోసం గతేడాది నవంబరు 8న అనుమతి పొందారు. నవంబరు 10, 11, 12వ తేదీల్లో చిత్రీకరించేందుకు అనుమతించారు. కల్యాణ వేదిక, ఆక్టోపస్ నూతన భవనం, శ్రీవారి సేవా సదన్ ప్రాంతాల్లోనే సర్వే చేపట్టాలి. అయితే సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న రాంభగీచా నుంచి ఆస్థాన మండపం వద్దకు చేరుకుని అక్కడి నుంచి డ్రోన్ను ఆకాశంలోకి పంపి శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించినట్లు తేలింది. ఆ సమయంలో పలువురు స్థానికులు హెచ్చరిస్తున్న దృశ్యాలు కూడా ఇందులో రికార్డు అయినట్లు అధికారులు గుర్తించారు.
తిరుమల డ్రోన్ వివాదం పెద్ద దుమారమే రేపింది. ఈ ఘటనపై తిరుమల పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి డ్రోన్ను వినియోగించి వీడియో చిత్రీకరణ చేసి..గృహశ్రీనివాస, ఐకాన్ ఫ్యాక్డ్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. దీనిపై సెక్షన్ 447 కింద కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా స్పందించారు. హైదరాబాద్ కు చెందిన ఓ సంస్థ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లుగా గుర్తించామని చెప్పారు. ఆ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని చెప్పారు. అవి ఒరిజినల్ డ్రోన్ చిత్రాలు లేక ఫోటోలను యానిమేట్ చేసి వీడియోగా రూపొందించారనే విషయాన్ని తేల్చేందుకు చిత్రాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించామన్నారు.
సంబంధిత కథనం