అక్టోబరు 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది. ఆస్థానంలో భాగంగా శ్రీమలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు.
సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుడిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది.
సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 20న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి , శిలా తోరణం వరకు క్యూలో వేచి ఉన్నారు భక్తులు. సర్వదర్శనం భక్తులకు 24 గంటల సమయం పడుతుంది. 300 రూ..శీఘ్రదర్శనంకు 4 గంటల సమయం పట్టే అవకాశం. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుంది.
నిన్న స్వామివారిని 71,634 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,980గా ఉంది. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: రూ.4.74 కోట్లు.