Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు తిరుమల శ్రీవారి కల్యాణ రథం - ఈసారి నమూనా ఆలయం కూడా ఏర్పాటు, విశేషాలివే-ttd kalyanaratham started for maha kumbh mela 2025 in prayagraj uttarpradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు తిరుమల శ్రీవారి కల్యాణ రథం - ఈసారి నమూనా ఆలయం కూడా ఏర్పాటు, విశేషాలివే

Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాకు తిరుమల శ్రీవారి కల్యాణ రథం - ఈసారి నమూనా ఆలయం కూడా ఏర్పాటు, విశేషాలివే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 08, 2025 01:03 PM IST

Maha Kumbh Mela 2025 Updates : ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళాకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది. కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు పూజలు చేశారు. పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభమేళా జరగనుంది.

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా - తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం
ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా - తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం

ఉత్తరప్రదేశ్​లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు సర్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగానూ భక్తులు భారీగా తరలివెళ్లనున్నారు. జనవరి 13వ తేదీ నుంచే ఈ కుంభమేళా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కుంభమేళకు తిరుమల నుంచి శ్రీవారి కల్యాణ రథం బయల్దేరింది.

yearly horoscope entry point

శ్రీవారి నమూనా ఆలయం…!

ఈ కల్యాణ రథానికి టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పూజలు చేశారు. పచ్చ జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా జరగనుంది. కల్యాణ రథం బయల్దేరిన సందర్భంగా బీఆర్‌ నాయుడు మీడియాతో మాట్లాడారు.

జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న కుంభమేళ జరగనుందని బీఆర్ నాయుడు పేర్కొన్నారు. సెక్టార్ 6, భజరంగ్ దాస్ రోడ్డులోని నాగ వాసుకి దేవాలయం సమీపంలో యూపీ ప్రభుత్వం కేటాయించిన 2.89 ఎకరాల స్థలంలో తిరుమల శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామన్నారు. 170 మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలు నిర్వహిస్తామని చెప్పారు. ఉత్తరాది భక్తులకు స్వామి వారి అర్జిత సేవలను తిలకించే భాగ్యం కల్పిస్తున్నట్లు వివరించారు.

జనవరి 18,26 తేదీల్లో ఫిబ్రవరి 3 ,12 తేదీల్లో 4 సార్లు శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. మహా కుంభమేళాను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మాట్లాడుతూ… ప్రపంచంలోనే అతి పెద్ద ఉత్సవం కుంభమేళా కావడంతో అక్కడ కు వచ్చే భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం:

తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుండి 19వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార ద‌ర్శ‌నాలు ఉండనున్నాయి. ఈ మేరకు జనవరి 7వతేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జ‌రిగింది.

సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు.

స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచారు. శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

Whats_app_banner

సంబంధిత కథనం