TTD Kalyanamastu : టీటీడీ కళ్యాణమస్తు వాయిదా…. తేదీ ఖరారు తర్వాత మళ్లీ ప్రకటన..
దాదాపు దశాబ్ద కాలం తర్వాత టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కళ్యాణమస్తు కార్యక్రమం అనివార్య కారణాలతో వాయిదా పడింది. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత వివాహాలను నిర్వహిస్తున్నట్లు రెండు నెలల క్రితమే టీటీడీ ప్రకటించింది.
టీటీడీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన కళ్యాణమస్తు కార్యక్రమం వాయిదా పడింది. దాదాపు పదేళ్లుగా ఈ కార్యక్రమం నిలిచిపోయింది. టీటీడీ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా వివాహాలను నిర్వహించే కార్యక్రమాన్ని గతంలో నిర్వహించే వారు. రకరకాల కారణాలతో ఈ కార్యక్రమం నిలిచిపోయింది. కళ్యాణమస్తు కార్యక్రమ నిర్వహణపై రకరకాల వర్గాల నుంచి టీటీడీకి వినతులు రావడంతో కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీంతో ఆగష్టు 7న రాష్ట్ర వ్యాప్తంగా కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
కళ్యాణమస్తు కార్యక్రమంలో వివాహాలు చేసుకునేందుకు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో దరఖాస్తులు కూడా స్వీకరించారు. జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యమైన ప్రదేశాల్లో టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేశారు. పెద్ద సంఖ్యలో కళ్యాణమస్తుకు దరఖాస్తులు వచ్చినా, ముందుగా ప్రకటించిన తేదీలో కార్యక్రమాన్ని నిర్వహించడంలో టీటీడీ వెనకడుగు వేసింది. 2011 లో నిలిచిపోయిన కార్యక్రమాన్ని దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా చివరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పేద హిందూ యువతీ యువకులకు పెళ్లి ఆర్ధిక భారం కాకూడదనే ఉద్దేశంతో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పేద యువతీ యువకులకు సంప్రదాయబద్దంగా శుభముహుర్తంలో వివాహాలు జరుపుతున్నట్లు టీటీడీ ప్రకటించడంతో పెద్దసంఖ్యలో దరఖాస్తులు అందాయి. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. చాంద్రమాన శుభకృత్ నామ సంవత్సరం శ్రావణ శుక్రపక్ష దశమి రోజు ఉదయం 8.07 నుంచి 8.17 మధ్య అనురాధ నక్షత్రం, సింగలగ్నంలో వివాహాలు జరపాలని తొలుత నిర్ణయించారు.
ప్రభుత్వం నుంచి అనుమతుల రాకే….
కళ్యాణమస్తు కార్యక్రమానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనుమతులు రాకపోవడంతోనే వాయిదా పడినట్లు చెబుతున్నారు. సామూహిక వివాహ కార్యక్రమ వాయిదాపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకున్నా ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. కళ్యాణమస్తు కార్యక్రమాన్ని పున: ప్రారంభించాలని సీఎం అమోదంతోనే నిర్ణయించినా, ఆదివారం ముఖ్యమంత్రి అందుబాటులో ఉండకపోవడంతో వాయిదా వేసినట్లు చెబుతున్నారు. టీటీడీ అధికారికంగా ప్రకటన చేయకున్నా నీతి ఆయోగ్ సమావేశాల కోసం సిఎం ఢిల్లీ వెళ్లడంతో మరో ముహుర్తంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని టీటీడీ భావిస్తున్నట్లు సమాచారం.
టాపిక్