Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు
Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణంకు ఊపయోగించే దర్భ చాప, తాడును శుక్రవారం ఊరేగించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
Tirumala Srivari Brahmotsavam 2022: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 7 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా ధ్వజారోహణంకు ఊపయోగించే దర్భ చాప, తాడును వరాహస్వామి అథితి గృహాల వద్ద ఉన్న టీటీడీ అటవీ విభాగం కార్యాలయం ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు.
ట్రెండింగ్ వార్తలు
అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 7వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణంకు దర్భ చాప, తాడు చాలా కీలకం. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.
రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉంటాయి. కానీ తిరుమలలో విష్ణు దర్బ ఉపయోగిస్తారు. ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంట కాలువల మీద పెరిగే ఈ దర్భను సేకరిస్తారు.
ఈ దర్భను తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్బను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు. ధ్వజారోహణంకు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి. అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో డిఎఫ్ వో శ్రీనివాసులు రెడ్డి, విజివో బాలిరెడ్డి, రేంజ్ అధికారి శ్రీ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య తేదీలివే…..
Tirumala brahmotsavam 2022 dates: తిరుమలలో రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టిటిడి సమాయత్తమవుతోంది. సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు ఆలయ మాడ వీధుల్లో వాహనసేవలు జరుగనున్నాయి.
-సెప్టెంబర్ 26న రాత్రి 7 నుండి 8 గంటల మధ్య అంకురార్పణ చేస్తారు. సెప్టెంబరు 27న మొదటి రోజు సాయంత్రం 5.15 నుండి 6.15 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 నుండి 11 గంటల వరకు పెద్ద శేష వాహనంపై ఊరేగింపు ఉంటుంది.
-సెప్టెంబరు 28న రెండో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు హంస వాహనంపై విహరిస్తారు.
-సెప్టెంబర్ 29న మూడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సింహ వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు ముత్యపు పందిరి వాహనంపై ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.
-సెప్టెంబర్ 30న నాలుగో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు కల్పవృక్ష వాహనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు సర్వభూపాల వాహనంపై దర్శనమిస్తారు.
-అక్టోబర్ 1న ఐదో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు మోహినీ అవతారం, రాత్రి 7 నుండి గరుడ వాహనంపై భక్తులకు కనిపిస్తారు.
-అక్టోబర్ 2న ఆరో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు హనుమంత వాహనం, సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు రథరంగ డోలోత్సవం(స్వర్ణ రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు గజ వాహనంపై స్వామి వారు దర్శనమిస్తారు.
-అక్టోబర్ 3న ఏడో రోజు ఉదయం 8 నుండి 10 గంటల వరకు సూర్యప్రభ వాహనం, మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపన తిరుమంజనం, రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై కనిపిస్తారు.
-అక్టోబర్ 4న ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం (చెక్క రథం), రాత్రి 7 నుండి 9 గంటల వరకు అశ్వ వాహనంపై విహరిస్తారు.
-అక్టోబర్ 5న తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 9 నుండి 10 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు.
సంబంధిత కథనం