Tirumala : అక్టోబరు 15 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. 29న ఆలయం మూసివేత - టీటీడీ ఈవో
TTD EO Dial Your program:అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు . అక్టోబర్ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు తెలిపారు.
Tirumala Latest News : గతమాసం సెప్టెంబర్ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని తెలిపారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ముందుగా ఈవో భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి….

- బ్రహ్మోత్సవాల కారణంగా అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు అష్టదళపాదపద్మారాధన, తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకరణ సేవలు రద్దయ్యాయి. ముందస్తుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవాటికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులను వారికి సూచించిన వాహనసేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది.
- వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలు రద్దు.
- భక్తుల భద్రత దృష్ట్యా అక్టోబరు 19న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు.
- బ్రహ్మోత్సవాల మరుసటిరోజైన అక్టోబరు 24న పార్వేట ఉత్సవం జరుగునుంది.
- అక్టోబరు 19న గరుడసేవ సందర్భంగా అక్టోబరు 17 నుండి 19వ తేదీ వరకు కాటేజి దాతలకు గదుల కేటాయింపు ఉండదు. బ్రహ్మోత్సవాల మిగతా రోజుల్లో యధావిధిగా ఉంటుంది.
ఎస్ఎస్డి టోకెన్ల రద్దు…
సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 17వ తేదీ వరకు పెరటాసి మాసం కారణంగా గత శుక్ర, శని, ఆది, సోమవారాల్లో అనూహ్యంగా భక్తులు తరలివచ్చారు. టీటీడీ, విజిలెన్స్ సిబ్బంది, శ్రీవారి సేవకులు, టీటీడీ విద్యాసంస్థలకు చెందిన ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు కలిసి భక్తులకు విశేషంగా సేవలందించారు. రాబోయే పెరటాసి రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు విస్తృతంగా సేవలందించేందుకు చర్యలు తీసుకున్నాం. పెరటాసి శనివారాలు, వరుస సెలవుల కారణంగా ఆధిక రద్దీ దృష్ట్యా, ఎస్ఎస్డి టోకెన్ల జారీని రద్దు చేశాం. తిరుపతిలో అక్టోబర్ 6, 7, 8, 13, 14, 15వ తేదీలలో ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేయబడవు. భక్తులు నేరుగా తిరుమలకు వచ్చి సర్వదర్శనానికి వెళ్లవచ్చు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరుతున్నాం.
-అక్టోబర్ 29న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
- అక్టోబర్ 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం కారణంగా అక్టోబర్ 28న రాత్రి 7.05 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేసి అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3.15 గంటలకు తెరుస్తారు. ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి.
- అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1.05 నుండి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది.
- ఈ కారణంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని అక్టోబరు 28న సాయంత్రం 6 గంటలకు మూసివేసి అక్టోబరు 29న ఉదయం 9 గంటలకు తెరుస్తారు. ఈ సమయంలో అన్నప్రసాదాల పంపిణీ ఉండదు కావున భక్తులు గుర్తించాలని కోరడమైనది.
- అక్టోబర్ 28న సహస్రదీపాలంకారసేవను, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనాన్ని రద్దు చేయడం జరిగింది.
- అటవీశాఖ అధికారులు అలిపిరి కాలినడక ప్రాంతంలో ఇప్పటివరకు ఆరు చిరుతలను బందించారు. ట్రాప్ కెమెరాల 15 రోజుల పాటు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించారు. దీంతో సెప్టెంబరు 29వ తేదీ నుంచి ఘాట్ రోడ్లలో రాత్రి 10 గంటల వరకు ద్విచక్ర వాహనాలను అనుమతిస్తున్నాం. 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతిస్తున్నాం. వైల్డ్లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిపుణులు అలిపిరి కాలినడక మార్గాన్ని రెండు రోజులపాటు పరిశీలించి వారంలో నివేదిక ఇస్తామని తెలిపారు. వారి సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటాం.
- అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో, తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.
- టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో గల శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్గా గుర్తించి ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ‘‘ప్రైడ్ ఆఫ్ నేషన్’’ అవార్డును ప్రకటించడం ఎంతో సంతోషకరం.
- తిరుమలలో యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేయడం జరుగుతోంది.
- క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు ఖాళీ చేసిన ఒక గంటలోనే రీఫండ్ ప్రక్రియను మొదలుపెడతారు. అయితే ఈ మొత్తం భక్తుల బ్యాంకు ఖాతాల్లోకి చేరడానికి 3 నుంచి 7 పనిదినాల సమయం పడుతుంది.
- భక్తులు గది ఖాళీ చేసినపుడు మొదటిసారి, రీఫండ్ ప్రక్రియ మొదలైనపుడు రెండోసారి, బ్యాంకులో రీఫండ్కు సంబంధించిన లావాదేవీ జరిగినపుడు బ్యాంకు నంబరుతో మూడోసారి భక్తులకు ఎస్ఎంఎస్ పంపడం జరుగుతోంది.
- రీఫండ్ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్మెంట్ను తప్పుగా సరిచూసుకుంటున్నారు.
సెప్టెంబరు నెలలో నమోదైన వివరాలు :
- శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య - 21.01 లక్షలు
- హుండీ కానుకలు - రూ.111.65 కోట్లు
- విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య - 1.11 కోట్లు
- అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య - 53.84 లక్షలు
- తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య - 8.94 లక్షలు