విద్యార్థుల కోసం టీటీడీ వినూత్న కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారిలో మానవతా విలువను పెంపొందించేందుకు 'సద్గమయ' పేరుతో కొత్త కార్యక్రమం చేపట్టనుంది. ఇందుకు సంబంధించి ఈవో శ్యామలరావు కీల ప్రకటన చేశారు. ఈ నెల 16 నుండి 19 తేదీ వరకు సద్గమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంపై సమీక్షించిన ఈవో… టీటీడీకి చెందిన 7 పాఠశాలలలో విద్యార్థులకు దైవభక్తి, నైతిక విలువలు, నిజాయితీ, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత తదితర అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
భగవద్గీత సారాంశాన్ని పిల్లలకు అర్థమయ్యేలా, సరళమైన పదజాలంతో బోధించాలని ఈవో సూచించారు. శ్రీవారి వైభవాన్ని యువత, పిల్లలకు మరింతగా తెలిసేలా శిక్షణ ఉండాలన్నారు. బాలబాలికలకు చిన్న వయసు నుంచే సనాతన ధర్మం, ఉమ్మడి కుటుంబం, తల్లి, తండ్రి, గురువు, దైవము, సమాజం, దేశం గొప్పతనాన్ని తెలియజేసే అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు.
టీటీడీకి చెందిన 7,8,9 తరగతుల పిల్లలకు తిరుపతిలోని ఎస్.జీ.ఎస్. హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, ఎస్వీ హైస్కూల్, ఎస్.కె.ఆర్.ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ , ఎస్పీ బాలికల పాఠశాలలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇక తిరుమలలోని ఎస్వీ హైస్కూల్, తాటితోపులోని ఎస్.కె.ఎస్. హైస్కూల్ పిల్లలకు ఆయా పాఠశాలలలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు అవసరమైన ‘సద్గమయ’ మాడ్యూల్, లిటరేచర్ పుస్తకాలు అందించాలన్నారు.
విద్యార్థులను దేశానికి బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం మొదటగా టీటీడీ పాఠశాలల విద్యార్థులతో ప్రారంభించనున్నారు. తర్వాత మిగతా పాఠశాలల్లో అమలు చేసే అవకాశం ఉంది.