తిరుమల శ్రీవారి దర్శనం సిఫారసు లేఖలు తిరస్కరిస్తున్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు క్లారిటీ-ttd board member clarified tirumala srivari darshan on recommendation letters rejections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమల శ్రీవారి దర్శనం సిఫారసు లేఖలు తిరస్కరిస్తున్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు క్లారిటీ

తిరుమల శ్రీవారి దర్శనం సిఫారసు లేఖలు తిరస్కరిస్తున్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు క్లారిటీ

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ క్లారిటీ ఇచ్చారు. సిఫారసు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

తిరుమల శ్రీవారి దర్శనం సిఫారసు లేఖలు తిరస్కరిస్తున్నారా? టీటీడీ బోర్డు సభ్యుడు క్లారిటీ

వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తుల రద్దీతో ప్రజాప్రతినిధులు జారీ చేసిన సిఫారసు లేఖలను తిరస్కరిస్తున్నారని కొందరు భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ స్పందించారు. సిఫారసు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనంపై స్పష్టత ఇచ్చారు.

సిఫారసు లేఖలు యథాతథం

ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలతో తిరుమల శ్రీవారి దర్శనం యథాతథంగా కొనసాగుతోందని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. బోర్డు సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల లేఖలతో దర్శనం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. మే, జూన్‌ నెలలకు సంబంధించి ముందుగా లేఖలు తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనాలు యథాతథంగా ఉంటాయన్నారు.

భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులతో శ్రీవారి మెట్టు మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. ఎస్​ఎస్​డీ టోకెన్ల కోసం క్యూలో ఉన్న భక్తులు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు.

తిరుమలలో తనిఖీలు

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో సైతం టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల నేపథ్యంలో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తిరుమలకు వెళ్లే వాహనాలు బారులు తీరుతున్నాయి.

తిరుమలలో పోలీసులు, బాంబ్​ స్క్వాడ్​ టీమ్స్ ముమ్మర తనిఖీలు చేస్తున్నాయి. శనివారం జీఎన్​సీ టోల్​ గేట్​, అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గం ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. వాహనాలను ఆపి పూర్తిగా తనిఖీ చేసి, లగేజీలను పరిశీలించారు. బాంబ్​ స్క్వాడ్​ ఆధ్వర్యంలో మేదరమిట్ట, రాంభగీచా అతిథి గృహాలు, పార్కింగ్ ప్రదేశాల్లో తనిఖీలు చేస్తున్నారు.

పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11 నుంచి 13వ తేదీ వరకు వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం మే 10వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌కు అంకురార్పణ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.150 చెల్లించి వసంతోత్సవంలో పాల్గొనవచ్చు.

ఉత్సవాల్లో భాగంగా మే 12వ తేదీ ఉదయం 9.45 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది. వసంతోత్సవాలు జరిగే మూడు రోజులు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భ‌క్తుల‌ను కటాక్షించనున్నారు.

మే 6న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు.

నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ ఉత్సవాల కార‌ణంగా మే 6, మే 10 నుంచి 13వ తేదీ వ‌రకు క‌ల్యాణోత్సవం, సహ‌స్రదీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది.

సత్యప్రసాద్ బండారు హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం