టీటీడీ బోర్డు కీలక నిర్ణయం, ఇకపై ప్రైవేట్ వ్యక్తులకు నో ఛాన్స్-ttd board decides against private allocation of land near tirumala hills ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  టీటీడీ బోర్డు కీలక నిర్ణయం, ఇకపై ప్రైవేట్ వ్యక్తులకు నో ఛాన్స్

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం, ఇకపై ప్రైవేట్ వ్యక్తులకు నో ఛాన్స్

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడుకొండలను ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించకూడదని టీటీడీ బోర్డు నిర్ణయించింది. ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించిన స్థలాల్లో మార్పులు చేసింది.

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం, ఇకపై ప్రైవేట్ వ్యక్తులకు నో ఛాన్స్

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలను ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌నంలో బుధ‌వారం టీటీడీ ధ‌ర్మకర్తల మండ‌లి స‌మావేశం జ‌రిగింది.

టూరిజం అథారిటీకి భూ కేటాయింపు

తిరుప‌తి రూర‌ల్ మండ‌లం పేరూరు గ్రామంలోని స‌ర్వే నెం.604లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కు చెందిన 24.68 ఎక‌రాల భూమిని టీటీడీకి బ‌ద‌లాయించాలని గత టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ స్థలానికి బ‌దులుగా తిరుప‌తి అర్బన్ లో స‌ర్వే నెం.588-ఏ లో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎక‌రాల స్థలాన్ని టూరిజం అథారిటీ కేటాయించేందుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.

భూముల బదిలీ

అదేవిధంగా తిరుప‌తి రూర‌ల్ లోని సర్వే నెం.604లోని ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎక‌రాల స్థలాన్ని టీటీడీకి బ‌ద‌లాయించ‌డం, దానికి బ‌దులుగా తిరుపతి అర్బన్ లోని స‌ర్వే నెంబ‌ర్ 588-ఏ లోని టీటీడీకి చెందిన 10.32 ఎక‌రాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టీటీడీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

శ్రీవారి మెట్టు మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం– ఈవో జె. శ్యామల రావు

తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో జె. శ్యామలరావు తెలిపారు. కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలియడంతో టీటీడీ అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మంలతో కలిసి ఈవో మంగళవారం తనిఖీలు చేపట్టారు.

శ్రీవారి మెట్టు వద్ద భక్తులు ఇబ్బందులు

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ... శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోవాలాల నుంచి సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.

టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఆటోవాలాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, భక్తుల నుంచి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.

బస్సుల సంఖ్య పెంపు

భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించుకుని, మరింత మెరుగైన పటిష్టమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుపతి నుండి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడాన్ని, టోకన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామన్నారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి పటిష్ట సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం