ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడేందుకు ఏడుకొండలను ఆనుకొని ఉన్న భూములను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.
తిరుపతి రూరల్ మండలం పేరూరు గ్రామంలోని సర్వే నెం.604లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ) కు చెందిన 24.68 ఎకరాల భూమిని టీటీడీకి బదలాయించాలని గత టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ స్థలానికి బదులుగా తిరుపతి అర్బన్ లో సర్వే నెం.588-ఏ లో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎకరాల స్థలాన్ని టూరిజం అథారిటీ కేటాయించేందుకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది.
అదేవిధంగా తిరుపతి రూరల్ లోని సర్వే నెం.604లోని ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎకరాల స్థలాన్ని టీటీడీకి బదలాయించడం, దానికి బదులుగా తిరుపతి అర్బన్ లోని సర్వే నెంబర్ 588-ఏ లోని టీటీడీకి చెందిన 10.32 ఎకరాల స్థలాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టీటీడీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వచ్చే భక్తులకు శ్రీవారి మెట్టు మార్గంలో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ ఈవో జె. శ్యామలరావు తెలిపారు. కాలినడకన వెళ్లే మార్గంలో టోకెన్లు పొందేందుకు భక్తులు అసౌకర్యానికి గురవుతున్నట్లు తెలియడంతో టీటీడీ అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మంలతో కలిసి ఈవో మంగళవారం తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ... శ్రీవారి మెట్టు మార్గంలో టోకెన్లు పొందడానికి భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, ఆటోవాలాల నుంచి సరైన సహకారం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు.
టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను ఆటోవాలాలు స్వప్రయోజనాలకు వాడుకుంటున్నట్లు, భక్తుల నుంచి విచ్చలవిడిగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు శాశ్వత పరిష్కార మార్గం దిశగా చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.
భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించుకుని, మరింత మెరుగైన పటిష్టమైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. తిరుపతి నుండి శ్రీవారి మెట్టు మార్గం వరకు బస్సుల సంఖ్య పెంచడాన్ని, టోకన్ల జారీ కౌంటర్లను పెంచే అంశాలను పరిశీలిస్తామన్నారు. భక్తుల నుండి ఫీడ్ బ్యాక్ సేకరించి పటిష్ట సౌకర్యాలు కల్పిస్తామన్నారు.
సంబంధిత కథనం