గుంతకల్లు రైల్వై స్టేషన్‌లో ఘోరం.. స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి పదేళ్ల బాలుడి దుర్మరణం-tragic incident at guntakal railway station 10 year old boy dies as slab crumbles ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  గుంతకల్లు రైల్వై స్టేషన్‌లో ఘోరం.. స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి పదేళ్ల బాలుడి దుర్మరణం

గుంతకల్లు రైల్వై స్టేషన్‌లో ఘోరం.. స్లాబ్‌ పెచ్చులు ఊడిపడి పదేళ్ల బాలుడి దుర్మరణం

Sarath Chandra.B HT Telugu

అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కుటుంబంతో కలిసి రామేశ్వరం విహార యాత్రకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వచ్చిన బాలుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు.

గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో పెచ్చులు పడి బాలుడి దుర్మరణం

గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ శ్లాబ్‌ పెచ్చులు ఊడి పడి పదేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. అమృత్‌ భారత్‌ పేరుతో దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరిస్తున్న సమయంలో గుంతకల్లు జంక్షన్‌లో జరిగిన ఘోరం అందరిని కలిచి వేసింది.

గుంతకల్లుకు చెందిన కుటుంబం రామేశ్వరం వెళ్లేందుకు బుధవారం రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. 7వ నంబర్‌ ప్లాట్‌ఫాంపై రైలు కోసం ఎదురు చూస్తున్నారు. రైల్వే స్టేషన్‌ భవనం శ్లాబ్‌ పెచ్చులు ఊడి పడటంతో పదేళ్ల బాలుడు మణికంఠ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

తలకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తెచ్చారు. అక్కడి నుంచి ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రైల్వే అధికారుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందినట్టు వారు ఆరోపించారు.

శ్లాబ్‌ పెచ్చులు ఊడిన ప్రాంతంలో పాతభవనాన్ని కవర్ చేస్తూ అల్యూమినియం ప్యానల్స్‌తో కవర్‌ చేశారు. అదే ప్రాంతంలో బాలుడి కుటుంబ వేచి ఉండటంతో శ్లాబ్‌ కూలి వారిపై పడింది. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనుల్లో పాత భవనాలకు ఫ్యాబ్రికేషన్‌, ప్యానల్స్‌తో కవర్‌ చేసి హంగులు అద్దుతున్నారనే విమర్శలు ఉన్నాయి.

గుంతకల్లుకు చెందిన వెంకటే‌శ్వర్లు, శ్రీవాణి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రామేశ్వరం రైలు కోసం ఎదురు చూస్తూ వెయిటింగ్‌ హాల్‌ వద్ద నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. తీర్థ యాత్రలకు వెళుతుండగా కొడుకును కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం