వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారుల దుర్మరణం, మృతదేహాల వెలికితీత-tragedy in ysr district five children die while swimming in a pond three bodies recovered ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారుల దుర్మరణం, మృతదేహాల వెలికితీత

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారుల దుర్మరణం, మృతదేహాల వెలికితీత

Sarath Chandra.B HT Telugu

వైఎస్సార్‌ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వేసవి సెలవుల్లో గడిపేందుకు సొంతూళ్లకు వెళ్లిన చిన్నారులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే చిన్నారులు ఆడుకుంటూ చెరువు వైపు వెళ్లి, అందులో ఈతకు దిగి మృత్యువాత పడ్డారు. అర్థరాత్రి సమయంలో చెరువులో నీటిని తోడి మృతదేహాలను వెలికి తీశారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలో విషాదం, నీట మునిగి ఐదుగురు చిన్నారుల దుర్మరణం

వైఎస్ఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మంగారిమఠం మండలం మల్లేపల్లెలో చెరువులో దిగిన ఐదుగురు చిన్నారులు నీటిలో మునిగి మృతి చెందారు.చెరువులో మునిగిన చిన్నారులను తరుణ్, చరణ్, పార్దు , హర్ష, దీక్షిత్‌గా గుర్తించారు. సమాచారం అందుకొన్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యం కాగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.

వేసవి సెలవుల్లో ఆనందంగా గడుపేందుకు బంధువుల ఇళ్లకు వచ్చిన చిన్నారులు ఒకేసారి ప్రమాదానికి గురయ్యారు. ఆడుకుంటూ ఊరి చెరువు వైపు వెళ్లిన చిన్నారులు అందులో దిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.

ఈ ఘటన కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లెలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం బోధనం గ్రామానికి చెందిన సుబ్బయ్య కుమారులు చరణ్(15), పార్దు (12) వేసవి సెలవులకు అమ్మమ్మ ఊరైన బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లె గ్రామా నికి వచ్చారు.

జమ్మలమడుగు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన రామకృష్ణ కుమారుడు హర్ష (12) మల్లేపల్లెలోని తన మేనత్త ఇంటికి వచ్చాడు. కాశీ నాయన మండలం మల్లేరు కొట్టాలు గ్రామానికి చెందిన నారాయణ కుమా రుడు తరుణ్ యాదవ్ (10) మల్లేపల్లెలోని పెదనాన్న ఇంటికి వచ్చాడు. వీరితో పాటు మల్లేపల్లె గ్రామానికి చెందిన తరుణ్ యాదవ్ కుమారుడు దీక్షిత్ (12) కలశాడు.

ఐదుగురు చిన్నారులు మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లారు. సాయంత్రం 5 గంటలు దాటుతున్నా చిన్నారుల అచూకీ లేకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు, వారి తల్లిదండ్రులు ఊళ్లో గాలించారు.

గ్రామ శివార్లలో ఉన్న చెరువు ఒడ్డుపై పిల్లల బట్టలు కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేప ట్టారు. మంగళవారం రాత్రి ఏడుగంటల నుంచి మోటార్ల సాయంతో చెరువులో నీటిని తోడారు. రాత్రి 11 గంటలకు పిల్లల మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన అన్నదమ్ములు మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

నెల్లూరులో అన్నదమ్ములు

నెల్లూరు జిల్లా సంగం మండల పరిధిలో ఉన్న కనిగిరి కాలువలో అన్నదమ్ములు గల్లంతయ్యారు. కోవూరు స్టౌ బీడీ కాలనీకి చెందిన గోవిందయ్య, శేషమ్మల కుమారులు చందు, నందులు వేసవి సెలవులకు 10 రోజుల క్రితం సంగంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చారు.

స్థానికంగా ఉన్న పిల్లలతో కలసి సోమవారం కాలువలో ఈతకెళ్లి గల్లంతయ్యారు. ఇరిగేషన్ అధికారుల సాయంతో కాలువకు నీటి విడుదలను నిలిపివేయడంతో మంగళవారం ఉదయానికి నీటి మట్టం తగ్గి మృతదేహాలు లభించాయి. ఒకేసారి ఇద్దరు కుమారుల్ని కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం