శ్రీమహావిష్ణువు కూర్మావతరంలో భక్తులకు దర్శనమిచ్చే శ్రీకూర్మం క్షేత్రంలో తాబేళ్లు పెద్ద సంఖ్యలో మృతి చెందడం వెలుగు చూసింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళంలో ఉన్న శ్రీకూర్మం క్షేత్రానికి చారిత్రక నేపథ్యం ఉంది. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో తాబేళ్లు సంచరిస్తుంటాయి. కూర్మావతరంలో శ్రీ మహావిష్ణువు కొలువుదీరాడని భక్తులు విశ్వసిస్తారు. వాటిని భక్తితో పూజిస్తారు. ఈ క్రమంలో ఇటీవల పెద్ద సంఖ్యలో తాబేళ్లు మృతి చెందడం వెలుగు చూసింది.
శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ఉన్న శ్రీకూర్మంలోని కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్లు పెద్ద సంఖ్యలో మరణించడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు రోజుల్లో పదుల సంఖ్యలో తాడేళ్లు మృతి చెందాయి.
ఆలయ అధికారులు, తాబేళ్ల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు గుట్టుగా దహనం చేశారు. ఆదివారం ఉదయం మృతి చెందిన తాబేళ్లను అక్కడ పని చేసే వ్యక్తి పుష్కరిణి ఒడ్డున పడేయడం చూసిన భక్తులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఏడు తాబేళ్ల కళేబరాలు ఉన్నాయి. మరో 9 తాబేళ్లను దహనం చేసినట్టు గుర్తించారు.
దీంతో భక్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆలయ ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో తాబేళ్లు మృతి చెందాయని ఆరోపిస్తున్నారు. శ్రీకూర్మం ఆలయంలో ఉన్న నక్షత్ర తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో 187 వరకు నక్షత్ర తాబేళ్లు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. వీటి సంరక్షణ బాధ్యతలను కాంట్రాక్టరుకు అప్పగించారు. అతను శ్రీకాకుళంలో ఉంటూ వాటి సంరక్షణ ఉద్యోగులకు అప్పగించాడు. రక్షిత జాబితాలో ఉన్న తాబేళ్లు మృతి చెందితే వాటి వివరాలను అటవీ శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.
ఆలయ ఈవో కూడా స్థానికంగా లేకపోవడంతో తాబేళ్ల సంరక్షణపై పర్యవేక్షణ కొరవడింది. తాబేళ్ళు చనిపోతే వాటికి పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయాలి. పోస్టుమార్టం రికార్డుల్లో నమోదు చేయకుండా దహనం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ రమణమూర్తి ఆదివారం రెండు తాబేళ్లు మాత్రమే చనిపోయాయని తెలిపారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్టు దేవాదాయశాఖ సహాయ కమిషనర్ భద్రాజీ తెలిపారు.
శ్రీ కూర్మంలో ఉండే తాబేళ్లను శ్రీమహావిష్ణువు ప్రతిరూపంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. ఆలయానికి అనుబంధంగా తాబేళ్ల పార్కును కూడా నిర్వహిస్తున్నారు. అరుదైన నక్షత్ర తాబేళ్లు కావడంతో వాటికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో రికార్డులు నిర్వహిస్తున్నారు. చనిపోయిన తాబేళ్లను ఆలయ ఈవో కార్యాలయం వెనుక భాగంలోనే దహనం చేస్తుండటంతో దేవాదాయ శాఖ తీరు చర్చనీయాంశంగా మారింది.
సంబంధిత కథనం