సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో ఘోర ప్రమాదం జరిగింది. స్వామి వారి నిజరూపాన్ని దర్శంచుకునేందుకు వచ్చిన భక్తులపై రిటైనింగ్ వాల్ కూలడంతో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది.
సింహాచలంలో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టిక్కెట్ క్యూలైన్పై ఆలయ రిటైనింగ్ వాల్లో భాగంగా నిర్మించిన సిమెంట్ గోడ కూలిపోయింది. దీంతో గోడ శిథిలాల కింద భక్తులు చిక్కుకుపోయారు. గోడతో పాటు మట్టిపెళ్లలు భక్తులపై పడటంతో స్పాట్లోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల చేపట్టిన నాసిరకం నిర్మాణం భక్తుల ప్రాణాలు బలి తీసుకుందనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయ చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తరలించారు. హోమంత్రి వంగలపూడి అనిత, విశాఖ కలెక్టర్ హరేంద్రప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యల్లో జాప్యం కారణంగా మృతుల సంఖ్య పెరిగిందని భక్తులు ఆరోపించినా ప్రమాదం జరిగిన వెంటనే సహాయ చర్యలు చేపట్టినట్టు హోంమంత్రి వివరించారు. మృతులను విశాఖపట్నంకు చెందిన స్థానికులుగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, సహాయ సిబ్బంది స్పందించి సహాయ చర్యలు చేపట్టారని హోమంత్రి అనిత తెలిపారు. దర్శనం తర్వాత సమాచారం తెలిసిన వెంటనే సహాయ చర్యల్ని చేపట్టామని వివరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది స్వామి వారి నిజరూప దర్శనానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం మెట్ల మార్గం వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించారు. పై భాగంలో భక్తుల కోసం టెంట్ను ఏర్పాటు చేశారు. గాలి వాన వచ్చిన సమయంలో భారీ టెంట్ కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు కదిలిపోయి రిటైనింగ్ వాల్పై పడిపోయాయి. అప్పటికే వర్షంతో నాని ఉండటంతో గోడ కూలిపోయినట్టు తెలుస్తోంది.
సింహాచలం వరహా లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు నిజరూపంలో దర్శనం ఇస్తుండటంతో స్వామివారిని దర్శించుకోడానికి పెద్ద ఎత్తున భక్తులు సింహగిరికి తరలి వచ్చారు. వేకువ జామున ఒంటిగంట నుంచి సుప్రభాత సేవలతో స్వామి వారిని మేల్కొపుతారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో వేరు చేశారు. నిజరూపంలోకి వచ్చిన వరహా లక్ష్మీ నరసింహ స్వామికి విశేష పూజలు నిర్వహించారు.
స్వామి వారి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసి పోయాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామి వారికి అశోక్ గజపతి తొలి చందనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు అంతరాలయ దర్శనాలు కల్పించారు. ప్రోటోకాల్ దర్శనాలు పూర్తైన తర్వాత సామాన్యులకు దర్శనాలు కల్పిస్తారు. ఈ క్రమంలో స్వామి నిజరూప దర్శనం కోసం వేలాదిగా భక్తులు క్యూ లైన్లలోకి చేరుకున్నారు. లక్ష మందికి పైగా భక్తులు చందనోత్సవంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తారు. దీంతో రూ.300 క్యూలైన్ వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది.
రిటైనింగ్ వాల్ను రెండు అడుగుల వెడల్పు మందంతో నిర్మించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో గోడ వెనుక ఉన్న మట్టి నానిపోయి గోడపై ఒత్తిడి పెరిగి కూలిపోయినట్టు వివరించారు. ప్రమాద స్థలంలో ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన ఇద్దరు ఆస్పత్రిలో మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న మహిళ ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయింది.
సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన ప్రమాదంపై మంత్రులు విచారం వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
సంబంధిత కథనం