ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చినా టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో.. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా, మరింత సులభంగా టోల్ వసూలయ్యేలా శాటిలైట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై.. ఏపీలో చిల్లకల్లు(నందిగామ) తెలంగాణలో పంతంగి(చౌటుప్పల్), కొర్లపహాడ్(కేతేపల్లి), టోల్ ప్లాజాల వద్ద ప్రస్తుతం శాటిలైట్ ద్వారా టోల్ వసూలు చేస్తున్నారు.
శాటిలైట్ విధానం ద్వారా వాహనం ఆగనవసరం లేకుండానే టోల్ దానికదే వసూలవుతోంది. దీంతో వాహనాలకు ఫాస్టాగ్ లేకున్నా టోల్ చెల్లింపు ఎలా జరిగింది.. అని వాహనదారులు ఆశ్చర్యపోతున్నారు. జాతీయ రహదారులపై వాహనదారులు ప్రయాణించిన దూరం మేరకే టోల్ వసూలు చేసేలా జీపీఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకొస్తామని.. గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. దీంట్లో భాగంగానే విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారిపై కూడా ఈ ట్రయల్రన్ చేపడుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
వాహనంలో జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) లేదా గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ వంటి శాటిలైట్ ఆధారిత పరికరం ఉంటుంది. కొన్నిసార్లు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలు కూడా ఉపయోగిస్తారు. శాటిలైట్లు వాహనం కచ్చితమైన స్థానాన్ని నిరంతరం ట్రాక్ చేస్తాయి. వాహనం టోల్ పరిధిలోకి ప్రవేశించినప్పుడు, నిష్క్రమించినప్పుడు ఈ సమాచారం నమోదు అవుతుంది.
ప్రవేశ, నిష్క్రమణ స్థానాల ఆధారంగా, వాహనం టోల్ రహదారిపై ప్రయాణించిన దూరాన్ని సిస్టమ్ లెక్కిస్తుంది. ప్రయాణించిన దూరం, టోల్ విధానాల ప్రకారం టోల్ ఛార్జీ నిర్ణయిస్తారు. టోల్ ఛార్జీ వాహన యజమానికి అనుసంధానమైన బ్యాంక్ ఖాతా నుండి ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది. ఈ విధానం వల్ల టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ట్రాఫిక్ తగ్గుతుంది. ప్రయాణించిన దూరం మేరకే టోల్ చెల్లించే అవకాశం ఉంటుంది. టోల్ వసూలు మరింత పారదర్శకంగా ఉంటుంది.
సంబంధిత కథనం