వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే మే 01 నుంచి జులై 15 వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ మే 01 నుంచి పలు కీలక నిర్ణయాలు అమలు చేయనుంది.
వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 01 నుంచి జులై 15 వరకు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది.
అదేవిధంగా మే 01 నుంచి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుంచి అమలు చేయనుంది. మే 1 నుంచి సిఫార్సు లేఖల బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జులై 15 వరకు సిఫార్సు లేఖలు అనుమతించబోమని పేర్కొంది.
ప్రజాప్రతినిధులు, టీటీడీ బోర్డు సభ్యుల సిఫార్సు లేఖలు చెల్లవని ఓ ప్రకటలో వెల్లడించింది. ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు కల్పిస్తామని చెప్పింది. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు సిఫారసు లేఖలు రద్దు చేస్తున్నట్లు పేర్కొంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1.50 కోట్లు కార్పొరేట్ సామాజిక బాధ్యత(CSR) కింద ఇటీవల విరాళంగా అందించింది. ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ జోనల్ హెడ్ కె.ధారాసింగ్ నాయక్, రీజనల్ హెడ్ ఈ.వెంకటేశ్వర్లు విరాళం చెక్కును అందజేశారు.
చెన్నైకు చెందిన పొన్ ప్యూర్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆదివారం శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆ సంస్థ సీఎండీ ఎం.పొన్నుస్వామి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.పి.సూర్యప్రకాశ్ విరాళం చెక్కును అందజేశారు. ఈ విరాళాన్ని వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టులో భాగమైన శ్రీవేంకటేశ్వర అపన్న హృదయ పథకానికి వినియోగించాలని దాత అదనపు ఈవో ను కోరారు.
సంబంధిత కథనం