Tirumala Tickets : శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబరు 10న వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు
TTD Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది టీటీడీ. ఈనెల 10వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఆన్లైన్లో 2.25 లక్షల టికెట్ల జారీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
Tirumala Latest News : శ్రీవారి భక్తులకు అలర్ట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం. డిసెంబరు 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300/- దర్శన టికెట్ల కోటాను నవంబరు 10వ తేదీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు.
– తిరుపతిలో 9 కేంద్రాలలో 100 కౌంటర్లలో డిసెంబరు 22వ తేదీ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లు 4.25 లక్షలు విడుదల చేస్తాం.
– డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్ఆర్ఐల దర్శనాలు రద్దు.
– తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్లైన్లో విడుదల చేస్తారు.
– భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతోపాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాలి. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుందని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
గంటలోపే కాషన్ డిపాజిట్ రీఫండ్
తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసి యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన ఒక గంటలోపు కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ చేయడం జరుగుతోందని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 7 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్ డిపాజిట్ మొత్తం జమ చేస్తన్నామని తెలిపారు. ఈ సమాచారం ధ్రువీకరించుకోకుండా కొందరు భక్తులు కాల్ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నారని, భక్తులు తమ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించుకుని కాషన్ డిపాజిట్ మొత్తం రీఫండ్ కాకపోతేనే సంప్రదించాలని కోరారు.
రీఫండ్ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్మెంట్ను తప్పుగా సరిచూసుకుంటున్నారని, ఎస్ఎంఎస్లో సూచించిన విధంగా 3 నుండి 7 రోజులు వేచి ఉండడం లేదని వివరించారు. మరికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్ కోడ్ సబ్మిట్ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్ జనరేట్ కావడం లేదని వివరించారు.