Tirumala : తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి వయోవృద్ధుల టికెట్లకు సంబంధించి సోషల్ మీడియాలో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయని టీటీడీ తెలిపింది. భక్తుల్ని తప్పుదోవ పట్టించేలా ఉన్న ఆ వార్తలు పూర్తిగా అవాస్తమని టీటీడీ పేర్కొంది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మూడు నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ టిక్కెట్లు ఆగస్టు 2024 వరకు బుక్ అయ్యాయి. టికెట్ పొందిన వ్యక్తికి రూ.50 ఒక లడ్డూ ఉచితంగా ఇస్తారు.
తిరుమలలోని నంబి ఆలయానికి ఆనుకుని ఉన్న సీనియర్ సిటిజన్/పీహెచ్సీ లైన్ ద్వారా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేస్తుంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org , https://ttdevastanams.ap.in ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.
టీటీడీ ఈవో జె.శ్యామలరావు ఆదేశాల మేరకు భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా మంగళవారం ఇంజినీరింగ్ అధికారులు కూల్ పెయింట్ వేశారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో సోమవారం జరిగిన ఇంజినీరింగ్ విభాగం అధికారుల సమీక్షా సమావేశంలో భక్తుల సౌకర్యాల దృష్ట్యా వైట్ కూలెంట్ పెయింటింగ్ పనులు వెంటనే చేపట్టాలని ఈవో అధికారులను ఆదేశించారు. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు శ్రీవారి ఆలయం, బేడి ఆంజనేయ స్వామి ఆలయం, వాహన మండపం, రాంభగీచ, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నాలుగు మాడ వీధుల్లో వైట్ కూల్ పెయింట్ వేశారు.
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శనం, వసతి టికెట్ల కోటా విడుదల సమాచారాన్ని టీటీడీ ప్రకటించింది. టీటీడీ యాప్, వెబ్ సైట్ లో సెప్టెంబర్ కోటా వివరాలను వెల్లడించింది.