తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేల మంది భక్తులు దేశవిదేశాల నుంచి తరలి వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీ పలు రకాలుగా దర్శన ఏర్పాట్లు చేస్తుంది.
వీటిల్లో వీఐపీ సిఫార్సు లేఖలు ఒకటి. వీఐపీలు సిఫార్సు చేసిన వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇటీవల వీఐపీ సిఫార్లు లేఖలను నిలిపివేశారు.
తిరుమలలో మే 15 నుంచి వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కల్పిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా ఇటీవల టీటీడీ సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఎల్లుండి నుంచి సిఫార్సు లేఖలపై తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలు తిరిగి ప్రారంభించనున్నట్టు టీటీడీ కూడా ప్రకటించింది. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకటించడంతో... ఇవాళ సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేయనుంది టీటీడీ.
ఏపీ, తెలంగాణ ప్రతినిధులకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ తిరిగి ప్రారంభించనుంది. మే 15 నుండి వీఐపీ బ్రేక్ దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరిస్తుంది. ఈ లేఖల ద్వారా దర్శనం మే 16 నుంచి ప్రారంభమవుతుంది.
తిరుమలలో ఆఫ్లైన్ లో ఇస్తున్న శ్రీవాణి దర్శన టికెట్ల మిగిలిపోయాయంటూ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని టీటీడీ పేర్కొంది. వాస్తవానికి ఆన్ లైన్లో 500 టికెట్లు, తిరుపతి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచగా ఎప్పటికప్పుడు భక్తులు బుక్ చేసుకుంటున్నారని తెలిపింది.
"ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సందర్భం లేదు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్నారు. గత కొన్ని రోజుల్లో ఆఫ్ లైన్ లో పదుల సంఖ్యలో తగ్గాయేకాని, సోషల్ మీడియాలో గతవారం రోజుల్లో వందల సంఖ్యలో టికెట్లు మిగిలిపోయినట్లు ప్రచారం చేయడం అవాస్తవం. అవాస్తవ సమాచారాన్ని ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం తగదు"-టీటీడీ
సంబంధిత కథనం