తిరుమలలో వరుసగా అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. తిరుమలలో ఓ వ్యక్తి నమాజ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పలువురు కానిస్టేబుళ్లు మద్యం తాగి తిరుమలకు వచ్చారని ప్రచారం జరుగుతోంది.
కర్నూలుకు చెందిన కానిస్టేబుళ్లు రాజశేఖర్, ఓంకార్ నాయక్, షేక్ సరాఉద్దీన్ మద్యం మత్తులో అతివేగంతో వాహనం నడుపుతూ ఘాట్ రోడ్డులో ఆక్సిడెంట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ముగ్గురు కానిస్టేబుళ్లు మద్యం మత్తులో తిరుమలకు వచ్చారు. ఘాట్ రోడ్డులో ర్యాష్ డ్రైవింగ్ చేసి పలు వాహనాలను ఢీకొట్టారు. పలువురు భక్తులను ఇబ్బందులకు గురిచేశారు.
విషయం తిరుమల పోలీసులకు తెలియడంతో కానిస్టేబుళ్లను స్టేషన్కు తరలించారు. అనంతరం వీరికి డ్రంక్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా 300 పాయింట్లు చూపించినట్లు తెలుస్తోంది.
తిరుమల కల్యాణ వేదిక సమీపంలో అన్యమతస్థుడు నమాజ్ చేయడం కలకలం రేపింది. పవిత్ర పుణ్య క్షేత్రంలో జరిగిన ఈ ఘటనపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను బట్టి గుర్తుతెలియని వ్యక్తి తమిళనాడుకు చెందిన వాహనంలో ఉన్నట్లు గుర్తించారు.
దీంతో అన్యమతస్థులను తిరుమల కొండపైకి రావడంపై భద్రతా వైఫల్యంగా భక్తులు భావిస్తున్నారు. భక్తుల నుంచి ఆరోపణలు వస్తుండడంతో వాహనం ఆధారంగా వ్యక్తిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డును టీటీడీ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. ఒకవేళ అన్యమతానికి చెందిన డ్రైవర్లు ఉంటే వారిని కొండ దిగువనే నిలిపివేయాలని సూచించారు.
వారికి నో ఎంట్రీ అని ప్రచారం చేయాలన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయని రాజాసింగ్ అన్నారు. తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందని టీటీడీ బోర్డు సభ్యులు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఏదో విధంగా తిరుమల ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
వరుస ఘటనల నేపథ్యంలో వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో వ్యక్తి నమాజ్ వెనుక వైసీపీ ఉందని ఆరోపించారు.
సంబంధిత కథనం