Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి పురష్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. భక్తులు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.
టీటీడీ ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమం డిసెంబరు 28వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో జె.శ్యామలరావుకు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
టీటీడీ ఉద్యోగులందరికీ త్వరలోనే నేమ్ బ్యాడ్జ్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. కొందరు ఉద్యోగులు భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించే ఉద్యోగులపై చర్యలకు వెనుకాడబోమన్నారు. ఈ నేమ్ బ్యాడ్జ్ ద్వారా భక్తుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. శ్రీనివాసుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల పట్ల బాధ్యతాయుతంగా, అంకితభావంతో టీటీడీ ఉద్యోగులు ప్రవర్తించేందుకు ఈ బ్యాడ్జ్ విధానం ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. టీటీడీ అన్ని విభాగాల్లో పనిచేసే ప్రతీ ఉద్యోగికి ఈ నేమ్ బ్యాడ్జ్ త్వరలోనే ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
సంబంధిత కథనం