తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్...జులై కోటా ప్రత్యేక ప్రవేశ దర్శనం(రూ.300) టికెట్లను టీటీడీ నేడు గురువారం విడుదల చేయనుంది. జులై నెల ఆన్లైన్లో దర్శన టికెట్లు, ఆర్జిత సేవ టికెట్లు, వసతి గదుల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను నిన్న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జులై కోటాను బుధవారం ఉదయం 11 గంటలకు విడుదల చేసింది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు జులై నెల కోటా ప్రత్యేక దర్శనం ఉచిత టోకెన్లను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేశారు.
జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ. 300 టికెట్లను ఈనెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల జులై నెల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in లేదా టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ భక్తులను విజ్ఞప్తి చేసింది.
శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు మే 6 నుండి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.
మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మే 6 నుండి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.
అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30 నుంచి మే 2వ తేదీ వరకు శ్రీ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్బంగా మూడు రోజుల పాటు సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శ్రీ భగవద్ రామానుజాచార్యులపై సాహితీ సదస్సు, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఏప్రిల్ 30వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామివారి మంగళశాసనాలతో రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం పలువురు ప్రముఖుల ఉపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
సంబంధిత కథనం