నేటి నుంచి తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు - వాహ‌న‌సేవ‌ల తేదీలు, టైమింగ్స్ పూర్తి వివరాలివే-tirumala srivari salakatla brahmotsavas 2025 will begin from today full details here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  నేటి నుంచి తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు - వాహ‌న‌సేవ‌ల తేదీలు, టైమింగ్స్ పూర్తి వివరాలివే

నేటి నుంచి తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల బ్రహ్మోత్సవాలు - వాహ‌న‌సేవ‌ల తేదీలు, టైమింగ్స్ పూర్తి వివరాలివే

నేటి నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. వైఖానస ఆగమ సాంప్రదాయం ప్రకారం మంగళవారం బ్రహ్మోత్సవాలకు ’అంకురార్పణ’ జరిగింది. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా సాగుతాయి. ఇందుకోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది.

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది.

శాస్త్రోక్తంగా అంకురార్పణ…

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు - వాహన సేవల వివరాలు :

  • ఇవాళ( 24/09/2025) : ఇవాళ సాయంత్రం 05:43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం ఉంటుంది. రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంపై స్వామివారు కటాక్షిస్తారు.
  • 25/09/2025 : ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహన సేవ ఉంటుంది. మధ్యాహ్నం 1 నుండి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం నిర్వహిస్తారు.
  • 26/09/2025 : ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం ఉంటుంది. రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహన సేవ ఉంటుంది.
  • 27/09/2025 : ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై స్వామివారు విహరిస్తారు.
  • 28/09/2025 : ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి గరుడ వాహన సేవ నిర్వహిస్తారు.
  • 29/09/2025 : ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం ఉంటుంది. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై స్వామివారు విహరిస్తారు.
  • 30/09/2025 : ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ ఉంటుంది.
  • 01/10/2025 : ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహిస్తారు.
  • 02/10/2025 : ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం ఉంటుందని టీటీడీ వెల్లడించింది.

శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ అత్యంత వైభవంగా చేస్తారు. ఆరోజు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు చేరుకునే గొడుగుల ఊరేగింపులో భక్తులు ఎలాంటి కానుకలు అందించరాదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. భక్తులు అందించే కానుకలు టీటీడీకి చేరవని, కానుకలతో టీటీడీకి ఎలాంటి సంబంధమూ లేదని తెలియజేసింది.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పలు హిందూ సంస్థలు చెన్నై నుంచి గొడుగులను ఊరేగింపుగా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ గొడుగులు సెప్టెంబర్ 27న తిరుమలకు చేరుకుంటాయి. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు ఈ మేరకు వినతి చేసింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.