తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - వాచీల‌ ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పాల్గొనొచ్చు-tirumala srivari and other associated temple watches will be placed for e auction on may 1 and 2 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - వాచీల‌ ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పాల్గొనొచ్చు

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - వాచీల‌ ఈ-వేలానికి టీటీడీ ప్రకటన, ఇలా పాల్గొనొచ్చు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనుంది. మే 1, 2 తేదీల్లో ఈ-వేలం ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.

తిరుమల

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీల‌ను వేలం వేయనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.

మొత్తం 62 లాట్లు….

మే 1, 2వ తేదీల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ- వేలం ఉంటుందని టీటీడీ తెలిపింది. ఇందులో టైటాన్‌, సిటిజ‌న్‌, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్‌, ఇత‌ర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయని వివరించింది. కొత్తవి, ఉపయోగించిన, పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 62 లాట్లు ఈ-వేలంలో ఉంచినట్లు ప్రకటించింది.

ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్‌ కార్యాలయం (వేల‌ములు) 0877-2264429 నంబ‌రును సంప్రదించాలని టీటీడీ సూచించింది. కార్యాలయం వేళల్లో లేదా టీటీడీ వెబ్‌సైట్‌ www.tirumala.org లేదా రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్ www.konugolu.ap.govt.in ను సంప్రదించవచ్చని పేర్కొంది.

శ్రీపద్మావతీ ఆలయంలో విశేష ఉత్సవాలు:

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో మే నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • ⁠మే 2, 9, 16, 23, 30వ తేదీల‌లో శుక్ర‌వారం సంద‌ర్భంగా సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం నిర్వ‌హించ‌నున్నారు.
  • మే 6న ఉద‌యం 6 గంట‌ల‌కు ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.
  • మే 10న శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి వ‌సంతోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌.
  • మే 11 నుండి 13వ తేదీ వ‌ర‌కు అమ్మ‌వారి ఆల‌యంలో వ‌సంతోత్స‌వాలు.
  • మే 12న వ‌సంతోత్స‌వాల‌లో భాగంగా ఉద‌యం 9.45 గంట‌లకు అమ్మ‌వారి స్వ‌ర్ణ ర‌థం.
  • మే 18న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంట‌లకు ఆల‌య మాడ వీధులలో గజ వాహనంపై అమ్మవారు విహ‌రించి భ‌క్తుల‌ను అనుగ్ర‌హించ‌నున్నారు.
  • మే 27వ తేదీ రోహిణి న‌క్ష‌త్రం సంద‌ర్బంగా శ్రీ కృష్ణ స్వామివారికి సాయంత్రం 6 గంట‌లకు తిరుచ్చి ఉత్సవం జ‌రుగ‌నుంది.

శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాల సంద‌ర్భంగా పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం