తిరుమలకు కార్లలో వెళ్లే భక్తులకు అలర్ట్, ఈ భద్రతా సూచనలు పాటించాల్సిందే-tirumala police suggested ghat road car traveler must follow these safety instructions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  తిరుమలకు కార్లలో వెళ్లే భక్తులకు అలర్ట్, ఈ భద్రతా సూచనలు పాటించాల్సిందే

తిరుమలకు కార్లలో వెళ్లే భక్తులకు అలర్ట్, ఈ భద్రతా సూచనలు పాటించాల్సిందే

తిరుమలకు నిత్యం వందల సంఖ్యలో కార్లు వస్తుంటాయి. సొంతకార్లలో వచ్చే భక్తుల కోసం టీటీడీ, తిరుమల పోలీసులు కీలక సూచనలు చేశారు. ఘాట్ రోడ్డు ప్రయాణాలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కార్లు దగ్ధమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో భద్రతా సూచనలు చేశారు.

తిరుమలకు కార్లలో వెళ్లే భక్తులకు అలర్ట్, ఈ భద్రతా సూచనలు పాటించాల్సిందే

తిరుమలకు సొంత కార్లలో కుటుంబాలతో వచ్చే భక్తులకు టీటీడీ, పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఎండాకాలంలో తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవ్వడంపై నిపుణులను సంప్రదించగా...వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు చేశారు.

సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరుమల ఘాట్ రోడ్డుకు చేరుకుంటున్న కార్లు... అధిక వేడిమికి మంటలు అంటుకోవడం, కొన్ని మెకానికల్ సమస్యలు తలెత్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

1.సుదూర ప్రయాణం

500 కి.మీ లాంటి సుదూర ప్రయాణం తర్వాత ఇంజిన్ అప్పటికే చాలా హీట్ లో ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే కార్లు తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే ఇంజిన్ మరింతగా హీట్ ఎక్కుతుంది.

2.కొండలు, వంకర రోడ్లు:

ఘాట్ రోడ్లకు అధిక ఇంజిన్ శక్తి అవసరం. డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు, ఇది ఆర్పీఎం పెరిగి వేడి పెరుగుతుంది. దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుంది.

3. అధిక లోడుతో వెళ్లే వాహనాలు

తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణం. దీంతో ఇంజిన్‌పై ఒత్తిడిని పెరిగి వేడి సమస్యలకు దారితీస్తుంది.

4. వాహన మెయింటెనెన్స్

పాత వాహనాలు లేదా సరిగ్గా సర్వీస్ చేయని వాహనాలలో కూలంట్ లీక్‌లు లేదా తక్కువ స్థాయి కూలంట్ సమస్యలు తలెత్తుతాయి. పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు, ఫాల్టీ థర్మోస్టాట్లు, ఇంజిన్ ఆయిల్ సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో మంటలు రావడానికి కారణమవుతాయి.

5. ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యలు

ఇంధన పైపుల లీక్‌లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు వ్యాపించవచ్చు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అధిక వేడి, వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయి.

6. ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపడం

కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారు. దీని వలన ఫ్యాన్ పని చేయదు, వేడి బయటకు వెళ్లదు, ఫలితంగా హీట్ పెరిగి మంటలు రావచ్చు.

భద్రతా సూచనలు

  • సుదీర్ఘ ప్రయాణం, యాత్రకు బయలుదేరే ముందు బండిని సర్వీసింగ్ చేయించండి.
  • ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, AC ఆయిల్ తనిఖీ చేయించండి.
  • రేడియేటర్ లీకేజీ తనిఖీ చేయండి.
  • ఫ్యాన్ బెల్ట్ సరిచూసుకోవడం
  • బ్యాటరీలో డిస్టిల్ వాటర్ తనిఖీ చేయండి, వైర్ల చుట్టూ చేరిన తుప్పును తొలగించండి.
  • డ్రైవర్ ప్రతి రెండు గంటలకి ఒకసారి వాహనం ఆపి అయిదు నిమిషాల పాటు నడక, స్వల్ప వ్యాయామం, మంచినీరు తీసుకోవడం, టీ, అల్పాహారం సేవించడం చేయాలి.
  • సెల్ ఫోన్ మాట్లాడడానికి దూరంగా ఉండాలి.
  • వాహన dash board మీద ధర్మామీటర్, ఆయిల్ గేజ్ మీటర్ పరిశీలిస్తూ ఉండండి, ఏవైనా రెడ్ బ్లింకర్ కనపడగానే, బండి ఆపి తనిఖీ చేసుకోవాలి.
  • ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాలు వాహనానికి విశ్రాంతి ఇవ్వండి.
  • ఘాట్ ఎక్కే సమయంలో ఏసీ ఆఫ్ చేయండి.
  • కూలెంట్, ఇంజిన్ ఆయిల్, బ్రేకులు బాగున్నాయో లేదో ముందే తనిఖీ చేయండి.
  • బండి దిగే సమయంలో ఎక్కువగా బ్రేక్ వాడకుండా, ఇంజిన్ బ్రేకింగ్ వాడండి.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం