తిరుమలకు సొంత కార్లలో కుటుంబాలతో వచ్చే భక్తులకు టీటీడీ, పోలీసులు కీలక సూచనలు చేశారు. ఇటీవల ఎండాకాలంలో తిరుమలకు వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవ్వడంపై నిపుణులను సంప్రదించగా...వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలు చేశారు.
సుదీర్ఘ ప్రయాణం తర్వాత తిరుమల ఘాట్ రోడ్డుకు చేరుకుంటున్న కార్లు... అధిక వేడిమికి మంటలు అంటుకోవడం, కొన్ని మెకానికల్ సమస్యలు తలెత్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
1.సుదూర ప్రయాణం
500 కి.మీ లాంటి సుదూర ప్రయాణం తర్వాత ఇంజిన్ అప్పటికే చాలా హీట్ లో ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే కార్లు తక్షణమే తిరుమల ఘాట్ పైకెక్కడం ప్రారంభిస్తే ఇంజిన్ మరింతగా హీట్ ఎక్కుతుంది.
2.కొండలు, వంకర రోడ్లు:
ఘాట్ రోడ్లకు అధిక ఇంజిన్ శక్తి అవసరం. డ్రైవర్లు ఎక్కువగా తక్కువ గేర్లను ఉపయోగిస్తారు, ఇది ఆర్పీఎం పెరిగి వేడి పెరుగుతుంది. దిగే సమయంలో తరచుగా బ్రేకింగ్ చేయడం వల్ల బ్రేక్ సిస్టమ్ వేడిగా మారుతుంది.
3. అధిక లోడుతో వెళ్లే వాహనాలు
తీర్థయాత్రలలో బరువు బ్యాగులు, ఎక్కువ మందిని తీసుకెళ్లడం సాధారణం. దీంతో ఇంజిన్పై ఒత్తిడిని పెరిగి వేడి సమస్యలకు దారితీస్తుంది.
4. వాహన మెయింటెనెన్స్
పాత వాహనాలు లేదా సరిగ్గా సర్వీస్ చేయని వాహనాలలో కూలంట్ లీక్లు లేదా తక్కువ స్థాయి కూలంట్ సమస్యలు తలెత్తుతాయి. పాడైన రేడియేటర్లు లేదా ఫ్యాన్లు, ఫాల్టీ థర్మోస్టాట్లు, ఇంజిన్ ఆయిల్ సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ ఇంజిన్ వేడి పెరగడానికి, తీవ్రస్థాయిలో మంటలు రావడానికి కారణమవుతాయి.
5. ఇంధన లేదా ఎలక్ట్రికల్ సమస్యలు
ఇంధన పైపుల లీక్లు లేదా షార్ట్ సర్క్యూట్లు తీవ్రమైన వేడి ఉన్నప్పుడు మంటలు వ్యాపించవచ్చు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అధిక వేడి, వైబ్రేషన్లు సమస్యలను పెంచుతాయి.
6. ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపడం
కొంతమంది డ్రైవర్లు ఘాట్ ఎక్కిన వెంటనే వాహనాన్ని ఆపి ఇంజిన్ ఆఫ్ చేస్తారు. దీని వలన ఫ్యాన్ పని చేయదు, వేడి బయటకు వెళ్లదు, ఫలితంగా హీట్ పెరిగి మంటలు రావచ్చు.
సంబంధిత కథనం