తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది. తిరుమల, తిరుపతి కలిపి రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేస్తారు.
ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందవచ్చు.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్మెంట్లు, బయటి క్యూలైన్లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందిస్తుంటారు.
తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు. టీటీడీ అన్న ప్రసాద విభాగం తిరుమల, తిరుపతిలలో రోజుకు దాదాపు 2.5 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ (టీ, కాఫీలు, పాలు) చేస్తుంది.
టీటీడీ ఆధ్వర్యంలో ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో యూకే, ఐర్లాండ్, యూరప్లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్ వెలగా, కృష్ణ జవాజీ జర్మనీ, ఫ్రాంక్ఫర్ట్ నుంచి టీటీడీ ఈవో జె.శ్యామలరావును మంగళవారం తిరుపతి పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి, శ్రీనివాస కళ్యాణాలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
అనంతరం యూకే, ఐర్లాండ్, యూరప్లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21 వరకు టీటీడీ సహకారంతో స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏపీఎన్ఆర్టీఎస్ శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవోకు తెలిపారు. ఈ తిరు కళ్యాణ కార్యక్రమాలని టీటీడీ వేదపండితులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నారు.
యూకే, ఐర్లాండ్, ఐరోపాలలో శ్రీనివాస కళ్యాణాలు
• నవంబర్ 9 – బెల్ఫాస్ట్, ఐర్లాండ్
• నవంబర్ 10- డబ్లిన్, ఐర్లాండ్
• నవంబర్ 16- బేసింగ్స్టోక్, యూకే
• నవంబర్ 17 – ఐండ్హోవెన్, నెదర్లాండ్స్
• నవంబర్ 23- హాంబర్గ్, జర్మనీ
• నవంబర్ 24 – పారిస్, ఫ్రాన్స్
• నవంబర్ 30- వార్సా – పోలాండ్ –
• డిసెంబర్ 1 – స్టాక్హోమ్, స్వీడన్ –
•మిల్టన్ కీన్స్, యూకే – 7వ డిసెంబర్ 2024
• డిసెంబర్ 8 – గ్లౌసెస్టర్, యూకే.
• డిసెంబర్ 14 – ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ
• డిసెంబర్ 15- బెర్లిన్, జర్మనీ
• డిసెంబర్ 21. – జ్యూరిచ్, స్విట్జర్లాండ్
సంబంధిత కథనం