TTD Board Decisions : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి(TTD Board Meeting) భేటీ అయ్యింది. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు(TTD Boad Decisions) తీసుకున్నారు. స్విమ్స్ ఆసుపత్రిలో పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 479 నర్సుల పోస్టులను(SVIMS Nurse Posts) భర్తీ చేయాలని నిర్ణయించారు.
గతంలో టీటీడీలో కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(TTD Contract Outsourcing employees) రిక్రూట్మెంట్ చాలా వరకు ఆయా ప్రాంతాల్లో వారి అవసరాన్ని అనుసరించి ఏ నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా తీసుకునేవారు. అటువంటి ఉద్యోగుల సేవలను G.O.No.114 ప్రకారం క్రమబద్ధీకరించడానికి టీటీడీ బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ కొన్ని నిబంధనలను సడలిస్తూ నివేదికను పంపాలని నిర్ణయించింది. ఈ ఉద్యోగులకు 2014 కటాఫ్ ఇయర్ పరిగణఇంచాలని ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. టీటీడీ కాలేజీల్లో(TTD Colleges) అడ్మిషన్లు పొందిన విద్యార్థినులందరికీ ఎలాంటి సిఫార్సులు లేకుండా వసతి కల్పించేందుకు హాస్టళ్ల నిర్మాణానికి పాలక మండలి ఆమోదించింది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పీఏసీ-1లో రూ.1.88 కోట్లతో 10 లిఫ్టుల నిర్మాణానికి టెండర్ ఆమోదించింది. శ్రీ పద్మావతి రెస్ట్ హౌస్ ఔటర్ కార్డన్ ఏరియాలో అలాగే బాలాజీ నగర్ తూర్పు వైపు రూ.1.50 కోట్లతో సెక్యురిటీ ఫెన్సింగ్ ఏర్పాటుకు బోర్డు అంగీకారం తెలిపింది.
తిరుమలలో రూ.14 కోట్లతో టీటీడీ ఉద్యోగులకు(TTD Employees) చెందిన పాత సీ టైప్, డీ టైప్, కొత్త సీ టైప్, డీ టైప్ క్వార్టర్లలో మిగిలిన 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీటీడీ బోర్డు ఆమోదించింది. ఐటీ సేవల కోసం టీటీడీకి టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం, లైఫ్సైకిల్ మేనేజ్మెంట్ ప్రాసెస్లో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులో భాగంగా ఐదేళ్లపాటు డేటా సెంటర్ల నిర్వహణకు రూ.12 కోట్లకుపైగా బోర్డు మంజూరు చేసింది. శ్రీవాణి ట్రస్ట్ (Srivani Trust)ఫండ్స్ ద్వారా 15 పురాతన ఆలయాలు, టీటీడీ నిర్మించిన 13 దేవాలయాలు, టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మరో 22 దేవాలయాలలో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు బోర్డు అనుమతి ఇచ్చింది. ఇటీవల ఘాట్ రోడ్డులో ప్రమాదంలో మరణించిన తిరుమల శ్రీవారి ఆలయ పరిచారిక యతిరాజన్ నరసింహన్ కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
టీటీడీ బోర్టు మాజీ సభ్యులు కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. బోర్డు మాజీ సభ్యులకు సంవత్సరంలో కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పిస్తారన్నారు. అయితే కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇతరులతో దర్శనానికి వస్తున్నారన్నారు. ఇలా దర్శనానికి పదే పదే రావడం సరికాదన్నారు. కుటుంబ సభ్యులను కాకుండా ఇతరులతో వస్తున్న వారిని శ్రీవారి దర్శనానికి అనుమతించమని బోర్డు సమావేశంలో నిర్ణయించామన్నారు.
సంబంధిత కథనం