శ్రీవారి దర్శన టోకెన్లు, టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోనే దర్శన క్యూలైన్లలోకి ప్రవేశించాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి కోరారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో ఆదివారం రాత్రి ఆయన సర్వ దర్శన క్యూలైన్లను పరిశీలించారు. టీబీసీ, ఏటీసీ వద్ద క్యూలైన్లలో భక్తులకు చేసిన ఏర్పాట్లను తనిఖీ చేశారు. క్యూలైన్లలోని భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ను ఆయన పరిశీలించి, భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా అన్న ప్రసాదాలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్యూ లైన్ లో టీటీడీ కల్పించే సౌకర్యాలపై భక్తుల నుండి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వేసవి సెలవులు, వారంతపు సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉందని చెప్పారు. నూతనంగా ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ద్వారా భక్తులకు నిరంతరాయంగా అన్న ప్రసాదాలు అందిస్తున్నామని తెలిపారు. సర్వ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులకు ప్రణాళికాబద్ధంగా సమన్వయంతో దర్శనాలు కల్పిస్తున్నామని తెలియజేశారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జులై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. లక్కీ డిప్ ద్వారా టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల జులై నెల కోటాను 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జులై నెల కోటాను 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
జులై నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జూన్ నెల ఆన్ లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జులై నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలలో జులై నెల గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
సంబంధిత కథనం