తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా ఆన్ లైన్ టికెట్లకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి నెల కోటాను అక్టోబరు 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించి వచ్చే ఏడాది జనవరి నెల కోటాను అక్టోబరు 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
2025 జనవరి నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
శ్రీవాణి టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అక్టోబరు 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
జనవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
తిరుమల, తిరుపతిలో 2025 జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. భక్తులు టీటీడీ వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 17న పౌర్ణమి గరుడసేవ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ప్రతినెలా పౌర్ణమి రోజున టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీమలయప్ప స్వామి గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
సంబంధిత కథనం