తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల జూలై నెల కోటాను ఏప్రిల్ 19న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఈ సేవా టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం ఏప్రిల్ 19 ఉదయం 10 గంటల నుంచి నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. ఏప్రిల్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. లక్కీ డిప్ ద్వారా ఈ టికెట్లు పొందిన భక్తులు ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లిస్తే వారికి టికెట్లు మంజూరవుతాయి.
పైన పేర్కొన్న శ్రీవారి ఆర్జితసేవలతో పాటు శ్రీవారి దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ కోరింది. ఇతర వెబ్ సైట్లను నమ్మి... మోసపోవద్దని సూచించింది. ఫేక్ వెబ్ సైట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.