తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. ముందుగా దర్శనం టికెట్లు, రూమ్ లు దొరకని వారు ఇబ్బందులు పడుతుంటారు. బస దొరక్క టీటీడీ భక్తుల కోసం వేసిన భారీ షెడ్లలోనే సేదతీరుతుంటారు. తిరుమలలో గదుల కోసం ఎవరిని సంప్రదించాలని సమాచారం లోపంతో భక్తులు ఇబ్బంది పడుతుంటారు. వీరిని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక సూచన చేసింది.
తిరుమలలో బస చేయడానికి గదులు దొరక్క ఇబ్బందులు పడే భక్తుల కోసం టీటీడీ ముఖ్య సూచన చేసింది. గదుల కోసం ఎలా ప్రయత్నించాలో వివరిస్తూ టీటీడీ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియోను పోస్టు చేసింది. తిరుమలలో గదుల కోసం తిరుమల బస్టాండ్ దగ్గర ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO)లో సంప్రదించాలని సూచించింది.
సీఆర్ఓ కేంద్రంలో భక్తులు ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే భక్తుల మొబైల్ నెంబర్కు గది కేటాయింపు వివరాలతో ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. ముందుగా సీఆర్ఓ ఆఫీసుకు చేరుకున్న భక్తులకు గదులు కేటాయిస్తారు.
ఈ ఆఫీస్ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తుల కోసం అందుబాటులో ఉంటుంది. ముందుగా గదులు బుక్ చేసుకోని కోకుండా తిరుమల వెళ్లినప్పుడు, గదుల కోసం ఇబ్బంది పడకుండా నేరుగా సీఆర్వో కార్యాలయానికి వెళ్లి, బసను సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు.
తిరుమల శ్రీవారి ఆలయంలో మే నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
– మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం
– మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి
– మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం
– మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి
– మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర
– మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి
– మే 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ
– మే 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం
– మే 22న హనుమజ్జయంతి
– మే 31న నమ్మాళ్వార్ ఉత్సవారంభం
సంబంధిత కథనం